అంగవైకల్యం బాధాకరం. అదొక శాపం. అందుకే తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల మానవీయంగా స్పందిస్తున్నది. దొడ్డ మనసుతో అక్కున చేర్చుకుంటున్నది. మునుపటి ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ‘మీకు మేమున్నాం’ అన్న భరోసాను అందిస్తున్నది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా దివ్యాంగుల సంక్షేమానికి అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఘనత ముమ్మాటికీ తెలంగాణకే దక్కుతుంది.
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నది. వారు స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహిస్తున్నది. ప్రతి నెలా 5 లక్షల మంది దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పింఛన్ను అందజేస్తున్నది. పింఛన్ రూపంలోనే ఏడాదికి రూ.1,800.96 కోట్లు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే ప్రప్రథమంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా మలక్పేటలో పార్క్ను ఏర్పాటుచేసిన ఘనత కూడా మనదే. వసతుల కల్పనతోపాటు సబ్సిడీ రుణాలను అందజేస్తూ స్వశక్తితో ఎదిగేందుకు తోడ్పడుతున్నది. వివిధ సంక్షేమ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ బాసటగా నిలుస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక హెల్ప్లైన్ను ప్రారంభించి వివిధ సేవలు అందిస్తున్నది.
విద్యాభివృద్ధికి బాటలు
అంధుల కోసం 6, శారీరక దివ్యాంగుల కోసం 12 మొత్తంగా 18 వసతి గృహాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వాటితోపాటు అంధుల కోసం 2, బధిరుల కోసం 3 మొత్తంగా 5 ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఆయా పాఠశాలలు, వసతి గృహాల ద్వారా సుమారు 2,300 మందికిపైగా దివ్యాంగ విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతి వరకు, వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగ విద్యార్థులకు చెల్లించాల్సిన కాస్మోటిక్, డైట్ చార్జీలను భారీగా పెంచి, అండగా నిలిచారు. సాధారణ విద్యార్థుల కంటే 25% అదనంగా దివ్యాంగులకు చెల్లించాలని నిర్ణయించారు. బాలికలకు కాస్మోటిక్ చార్జీల్లో రూ.100 శానిటరీ నాప్కిన్స్కు ప్రత్యేకంగా ప్రభుత్వం చెల్లిస్తున్నది. 4 జతల యూనిఫామ్కు అవసరమైన డ్రెస్ మెటీరియల్ కొనుగోలు, కుట్టు కూలీకి కలిపి రూ.3 వేలు చెల్లిస్తున్నది. డైట్ చార్జీలను కూడా గణనీయంగా పెంచి సహృదయతను చాటుకున్నది.
ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయతలపెట్టిన 80 వేల పైచిలుకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా ప్రకారం దాదాపు 3,200 ఉద్యోగాలు దివ్యాంగులకు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో దివ్యాంగ ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణను అందించేందుకు రాష్ట్ర దివ్యాంగ సంక్షేమశాఖ కృషిచేస్తున్నది. దివ్యాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దివ్యాంగ అభ్యర్థులకు ఆర్థిక చేయూతనందిస్తున్నది. ఒక్కో అభ్యర్థికి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఖర్చులను చెల్లిస్తున్నది. తొలివిడతగా 500 మందికి చంపాపేటలోని వసతిగృహంలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నది. గ్రూప్స్, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, యూపీఎస్సీ ఇలా అన్ని పోటీపరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేస్తున్నది. అంధులకు స్టడీ మెటీరియల్ను బ్రెయిలీ లిపిలో ముద్రించి ఉచితంగా అందిస్తున్నది. నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్ వినియోగంపై ఉచిత శిక్షణ ఇస్తున్నది.
దివ్యాంగుల హక్కుల చట్టం-2016అమలుకు ప్రత్యేక చర్యలు
దివ్యాంగుల హక్కుల చట్టం-2016 అమలుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఆర్థిక, అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఉన్న రిజర్వేషన్ను 3 నుంచి 5 శాతానికి పెంచింది. ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ చట్టం కేసుల విచారణకు ప్రత్యేక సెషన్స్, మెట్రోపాలిటన్ సెషన్స్ (హైదరాబాద్), మెట్రోపాలిటన్ సెషన్స్ (సైబరాబాద్)ను ప్రత్యేక కోర్టులుగా ప్రకటించింది. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో 5% రిజర్వేషన్ వర్తింపజేస్తున్నది. దివ్యాంగులకు సంబంధించి చట్టం, విధానాలు, కార్యక్రమాలు, పథకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి, వారి సంక్షేమానికి కృషి చేస్తున్న వివిధ శాఖల సమీక్ష, సమన్వయం కోసం మంత్రి అధ్యక్షతన రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటుచేసింది. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేపడతున్న పథకాల పరిధిలోకి రానటువంటి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించడానికి రూ.3.50 కోట్లతో కార్పస్ ఫండ్ కేటాయించింది. దివ్యాంగుల హక్కుల చట్టం, నిబంధనల అమలు పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను
నియమించింది.
అత్యాధునిక ఉపకరణాల పంపిణీ
గతంలో దివ్యాంగులకు చేతికర్రలు, వీల్చైర్లు, కృత్రిమ అవయవాలను నామమాత్రంగా అందజేసేవారు. తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన, ఖరీదైన ఉపకరణాలను అందజేస్తున్నది. ఇందుకు ఒక్క ఏడాదిలో రూ.20 కోట్లు వెచ్చించి నిబద్ధతను చాటుకున్నది. దివ్యాంగ విద్యార్థులకు 4జీ స్మార్ట్ఫోన్లు, ఎన్వీడీఏ (నాన్ విజువల్ డిజేబుల్డ్ యాక్సెస్), జాస్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్లతో కూడిన ల్యాప్టాప్లు, అంధుల కోసం డిజిటల్ టెక్నాలజీతో రూపొందించిన కేన్ స్టిక్లు, శారీరక వైకల్యంతో నడవలేని, కదలలేని వారికి బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, స్కూటీలను అందజేస్తున్నది. ఈ ఉపకరణాల సాయంతో దివ్యాంగులు ఎవరి సాయం లేకుండానే తమ దైనందిన కార్యాలను పూర్తి చేసుకుంటున్నారు. పలువురు స్వయం ఉపాధి పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. దివ్యాంగులు ఆత్మైస్థెర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అన్నిరంగాల్లో రాణించాలి. ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా.
– కొప్పుల ఈశ్వర్, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నది. విద్య, ఉపాధి అవకాశాలను పొందేవిధంగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. అత్యాధునిక ఉపకరణాలను అందజేస్తున్నది. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
– శైలజ, దివ్యాంగుల సంక్షేమశాఖ కమిషనర్
ఎక్కడా లేనిస్థాయిలో పింఛన్లు
తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా దివ్యాంగుల పింఛన్ల కోసం రూ.1,800 కోట్లు వెచ్చిస్తున్నది. ఖరీదైన అత్యాధునిక ఉపకరణాలను అందజేస్తున్నది. దివ్యాంగుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.
– నాగేశ్వర్రావు, దివ్యాంగుల శాఖ సలహా మండలి సభ్యుడు