చండూర్: మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా రాదని టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూర్ మున్సిపాలిటీలోని భవానీ ఫంక్షన్ హాల్లో నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు.
సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి పేరు వింటేనే ప్రజలు అస్యహించుకుంటున్నరని చెప్పారు. ఆయన ప్యాకేజీ తీసుకొని బీజేపీలోకి జంప్ అయ్యిండని ఆరోపించారు. ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఊర్లలోకి పోతే ప్రజలు చీపుర్లతో కొడుతరని రాజగోపాల్ రెడ్డి వణుకుతున్నడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ కూడా రాదని చెప్పారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. బూర నర్సయ్య గౌడ్కు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసమే బూర పార్టీని వీడారని ఆరోపించారు. ఆయన బీజేపీ ట్రాప్లో పడ్డారన్నారు. పార్టీని వీడిన తర్వాత బూర చేసిన వ్యాఖ్యలు బీసీలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. బూర మాటలు నమ్మి ఆయన వెంట ఎవరూ వెళ్లరన్నారు.
విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. బూర నర్సయ్య గౌడ్ విడుదల చేసిన లేఖను ఖండిస్తున్నమని చెప్పారు. ఆయన మనసులో ఎదో పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్నడని మండిపడ్డారు. కేసీఆర్పై అవాకులు చివాకులు పేలడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. బూర తీరు తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లుగా ఉందన్నారు.