హైదరాబాద్, జూన్1(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు అంగరంగవైభోగంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అసెంబ్లీ, సచివాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ, అలాగే రాజధాని నగరంలోని కూడళ్లను విద్యుత్తు కాంతులతో అలంకరించారు. రాష్ట్రం ఏర్పాటై ఏడేండ్లు పూర్తిచేసుకొని 8వ వడిలోకి అడుగిడిన సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో జరిగే ఉత్సవాలలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. దీనికి ముందు గన్పార్క్లోని స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.
రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఇతర ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్రప్రభుత్వ పురస్కార గ్రహీతల కవిసమ్మేళనం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది కవులతో కవిసమ్మేళనాలు జరుగనున్నాయి. అలాగే హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో యుగకర్త పేరుతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చిత్రపటాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు రవీంద్ర భారతిలో సురవరం ప్రతాపరెడ్డి కథాచిత్రోత్సవం ప్రదర్శిస్తున్నట్టు సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్లో జరిగే ఉత్సవాలలో కిన్నెరమెట్ల వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషాసింగ్ను సీఎం కేసీఆర్ సన్మానిస్తారు. ఈ సందర్భంగా క్రీడారులకు సీఎం కేసీఆర్ స్వయంగా నగదు బహుమతి అందజేస్తారు.
నేడు చట్టసభల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఈ నెల 2న ఉదయం 6 గంటలకు శాసనమండలి ప్రాంగణంలో, ఉదయం 6.30 గంటలకు శాసనసభ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వేర్వేరుగా జాతీయ జెండాలను ఎగురవేస్తారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొంటారు.