హుజూర్నగర్, అక్టోబర్ 9: గతంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్గా పనిచేసి రైతుబంధు పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడిన వజ్రాల జయశ్రీని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె అనుముల తహసీల్దార్గా పనిచేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. హుజూర్నగర్ మండలం బూరుగడ్డ రెవెన్యూ పరిధిలోని 36.23 ఎకరాల భూమికి పాసు పుస్తకాలను సృష్టించి ధరణి ఆపరేటర్ జగదీశ్ సాయంతో రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులను అప్పటి తహసీల్దార్ జయశ్రీ కాజేశారు. 2019లో ఆపరేటర్ జగదీశ్ బంధువుల పేరిట తహసీల్దార్ పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారు.
తద్వారా వచ్చిన రైతుబంధు నిధులను తహసీల్దార్, ఆపరేటర్ జగదీశ్ చెరి సగం పంచుకున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. ఈ విషయం ఇటీవల వెలుగు చూడగా ధరణి ఆపరేటర్ను మూడు నెలల క్రితమే విధుల నుంచి తొలగించారు. బుధవారం తహసీల్దార్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.