బిడ్డను చూసి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
ప్రాణభిక్ష పెట్టాలని దాతలకు వేడుకోలు
ఇల్లెందు, జూలై 1: ‘అమ్మా, నాకు బతకాలని ఉంది. బాగా చదువుకోవాలని ఉంది. మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేను. నన్ను వదిలిపెట్టి వెళ్లకండి. నన్ను బతికిస్తే జీవితాంతం మీకు సేవచేస్తా. పెద్ద చదువులు చదివి మీ పేరు నిలబెడతా. నన్ను కాపాడండి’.. అంటున్న బిడ్డ మాటలకు ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న తమ కూతురికి ప్రాణభిక్ష పెట్టాలని ప్రాథేయపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని 14వ నంబర్ బస్తీకి చెందిన బేబీ శివకుమార్-స్వప్న దంపతులకు కుమార్తె సృష్టి (15), ఓ కొడుకు ఉన్నాడు. శివకుమార్ చికెన్షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చదువు, ఆటపాటల్లో రాణించిన సృష్టికి రెండేండ్ల క్రితం బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. అల్లారుముద్దుగా పెంచుకొన్న బిడ్డను కాపాడుకొనేందుకు తల్లిదండ్రులు రూ.6 లక్ష లు అప్పు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. కొన్ని రోజులపాటు బాగానే ఉన్న బాలిక.. మరోసారి అనారోగ్యానికి గురవ్వడంతో బంధువుల సాయంతో హైదరాబాద్ తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు.. బ్లడ్ క్యాన్సర్ సెకండ్ స్టేజీలో ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం కోమాలో ఉన్న సృష్టి చికిత్సకు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమ బిడ్డకు ప్రాణం పోయాలని వేడుకొంటున్నారు. నగదు సహాయం చేయాలనుకొనే వారు.. బేబీ శివకుమార్ అకౌంట్నంబర్ 249910100018200, ఐఎఫ్ఎస్సీ కోడ్ UBIN0824992, యూబీఐ ఇల్లెందులో జమచేయాలని విజ్ఞప్తిచేశారు. వివరాలకు 8985395667, 6305023185 నంబర్లలో సంప్రదించాలని కోరారు.