హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): వైద్యరంగంలో సిబ్బంది కొరతను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థలతో కొంత తీర్చవచ్చని, ఆటోమేషన్ మరో ప్రత్యామ్నాయమని యాపిల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రోగుల శస్త్రచికిత్సలో రోబోలు సహకరిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని ఉదహరించారు. బయో ఏషియా సదస్సులో భాగంగా శనివారం నిర్వహించిన ‘ఫైర్ సైడ్ చాట్’లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించారు.
సంగీత: టెక్నాలజీ కొత్త శిఖరాలను అందుకుంటున్నది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలకు
సుంబుల్: యాపిల్కు సంబంధించి.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించి, వారి ఆరోగ్యాలను వారే కాపాడుకోగలిగేలా చేయగలగాలి. ప్రజలకు మనం ఇవ్వగలిగే అతి విలువైన బహుమతి అదే. ప్రివెంటివ్ హెల్త్ గురించి, హెల్త్కేర్ గురించి మీరు అపోలోలో ఏం చేస్తున్నారు?
సంగీత: మేము 40 ఏండ్ల కిందట ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అధునాతన ఆరోగ్య సంరక్షణను భారతీయులకు అందుబాటులోకి తీసుకురావాలని భావించాం. ఈ మేరకు నర్సింగ్ కాలేజీల స్థాపన, అత్యాధునిక టెక్నాలజీని భారత్కు తీసుకురావడంపై దృష్టిపెట్టాం. అందుకే ఇప్పుడు అత్యుత్తమ వైద్యసేవలు (హై ఎండ్ కేర్) అందించగలుగుతున్నాం. మేము నివారణ లేదా వ్యాధులను ముందస్తుగా గుర్తించడంపై దృష్టి పెట్టాం. ముందే ప్రమాదాన్ని గుర్తించగలిగితే ప్రజలకు ఆరోగ్యం అందించినట్టే.
సుంబుల్: ఫోన్లో లేదా క్లౌడ్లో ఉన్న డాటా మొత్తాన్ని మేం యాక్సెస్ చేయగలమని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. పరికరంలోని హార్ట్ బీట్, నడక వంటి హెల్త్ ఇండికేటర్ల నోటిఫికేషన్లను ఆన్ చేసినప్పుడే వినియోగదారులు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. అంతేతప్ప ఆ సమాచారం యాపిల్ తీసుకోదు. ప్రివెంటివ్కు సంబంధించి.. వినియోగదారులకు వ్యాధి లక్షణాలు కనిపించకముందే, వారి ఆరోగ్యంపై అంచనా వేసి హెచ్చరించే ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాం.
సంగీత: ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మరణాలు గుండె సమస్యల వల్లే వస్తున్నాయి. ముందస్తుగా ఇలాంటి జబ్బులు గుర్తించి, హెచ్చరించగలిగే వ్యవస్థలు ఇప్పుడు ప్రజలకు అవసరం. రెండు వారాల కింద మేము క్లినికల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ను ప్రారంభించాం. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.
సుంబుల్: కొన్నేండ్ల కింద మేము మహిళల కోసం ఒక ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాం. యాపిల్ వాచ్ను ధరించినప్పుడు వారి అవయవాల పనితీరును మేం గమనించాము. చాలామంది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) అనే వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించాం. ఇప్పటికీ ఈ వ్యాధి గురించి సమాజంలో పెద్దగా అవగాహన లేదు. అయితే బాధితుల్లో కొందరికి హృదయ స్పందనల్లో తేడాలు ఉన్నట్టు గమనించాం. వైద్యులు సైతం దీనిని ధ్రువీకరించడంతో.. మాలో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు గుండె లక్షణాలను విశ్లేషించి, హెచ్చరించే వ్యవస్థలపై మేం పనిచేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెల్త్కేర్ వర్కర్ల కొరత
సంగీత: హెల్త్కేర్ వర్కర్ల కొరతను కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలతో కొంత తీర్చవచ్చు. ఆటోమేషన్ మరో ప్రత్యామ్నాయం. ఇప్పటికే ఆపరేషన్ థియేటర్లలో రోబోలు పనిచేస్త్నుయి. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్యం చేరువవుతున్నది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ టెలి మెడిసిన్. కాబట్టి భవిష్యత్తులో సురక్షితమైన, మెరుగైన వైద్యసేవలు టెక్నాలజీ ద్వారానే సాధ్యం అవుతాయి.
సంగీత: ఆరోగ్య సంరక్షణలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం తగ్గిపోయింది. నాయకత్వం అనేది శారీరక బలంతో కాదు.. మానసిక పరాక్రమంతో సాధ్యమవుతుంది. మా హెల్త్కేర్ రంగంలో 60% మంది మహిళలే. ‘నాలెడ్జ్ ఎకానమీ’లో వారికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నది.
సుంబుల్: వాచ్ ద్వారా వినియోగదారులు ఆరోగ్యంపై సాధికారత పొందాలన్నదే మా ఉద్దేశం. లోతైన పరిశోధన, విస్తృత అధ్యయనం, శాస్త్రీయ ఆధారాలు దొరికిన తర్వాతే మేము కొత్తవాటిని అందుబాటులోకి తెస్తున్నాం. ఉదాహరణకు వాకింగ్ స్టెడీనెస్ను ఫోన్ను ఉపయోగించి అభివృద్ధి చేశాం. సుమారు రెండు లక్షలకుపైగా నమూనాలను విశ్లేషించిన తర్వాత కదలికలను వర్గీకరించి ఈ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చాం. ఇంకా ఎంతో సైన్స్ను మనం పరిశోధించాల్సి ఉన్నది. అమెరికా, కెనడాలో మేం క్లినికల్ హెల్త్ రికార్డులను అభివృద్ధి చేశాం. ఎవరైనా దవాఖానకు వెళ్లినప్పుడు ఆ రికార్డ్ను డాక్టర్తో పంచుకోవడానికి
వినియోగించుకోవచ్చు.
సంగీత: బయాలజీ, బైట్స్, బ్యాండ్ విడ్త్.. ఈ మూడు ‘బీ’లు హెల్త్ కేర్ రంగ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయి. మనకు ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే మన శరీరం దానిని సరిచేసుకోమని హెచ్చరిస్తుంది. వీటిని జీనోమ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో 7-9 శాతం మాత్రమే జీనోమ్ ఎక్స్ప్రెషన్స్ను గుర్తించగలం. దీనిని మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలి. పర్సనలైజ్డ్ హెల్త్ రికార్డ్ (పీహెచ్ఆర్) మరో గొప్ప సాధనం. ప్రతి ఒక్కరి చేతిలో పీహెచ్ఆర్ ఉంటే.. వెంటనే వారు తమ డాక్టర్కు వాటిని పంపి విశ్లేషించే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టాలి. దేశంలో హెల్త్ రికార్డుల డిజిటలీకరణ వేగంగా జరుగుతున్నది.