కులవృత్తులు కుదురుకోవాలె.. చేతివృత్తులకు చేవరావాలె.. ఈ సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. వృత్తిదారులను కాపాడేందుకు, వారి ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. అందులోభాగంగా చేతివృత్తికి టెక్ సొబగులు అద్దుతున్నది. వృత్తిదారులకు ఆధునిక నైపుణ్యాలపై తర్ఫీదును ఇప్పిస్తున్నది. వారికి సబ్సిడీపై ఆధునిక యంత్రపరికరాలను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలివిడతగా శిక్షణ పొందిన కొందరికి అధునాతన పనిముట్లు, అచ్చు యంత్రాలను అందజేస్తున్నది.
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వృత్తిదారులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు వారికి టెక్నాలజీకి దగ్గర చేస్తున్నది. అందులోభాగంగా శాలివాహనులకు విద్యుత్తుతో నడిచే సారె, మట్టిని జల్లెడ పట్టే, పిసికే పగ్మిల్స్ను, మట్టి గణపతి విగ్రహాల తయారీకి కావాల్సిన అచ్చులను అందజేస్తున్నది. మేదరి కులస్థులకు వెదురు బొంగులను నరికే కత్తులు, క్రాస్కటింగ్, డ్రిల్లింగ్ మిషన్స్, సన్డార్స్ తదితర ఉపకరణాలను ఇస్తున్నది. స్వర్ణకారులకు 1-4 లక్షల విలువైన యంత్ర పరికరాలను, అచ్చులను, రజకులకు వాషింగ్మిషన్లు, ఐరన్, డ్రయ్యర్లు సబ్సిడీపై అందజేస్తున్నది. అంతేకాదు.. ఉపాధి కల్పించేందుకు సిద్దిపేటలో మట్టిపాత్రలు, గృహోపకరణాల తయారీ పరిశ్రమ, ఆమనగల్లులో వెదురు వస్తువుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేదిశగా ముందుకు సాగుతున్నది. ఆయా ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేపట్టింది. ఈ-కామర్స్ వ్యాపారులు, బడా రిటైల్ స్టోర్స్ నిర్వాహకులతో సంపద్రింపులు జరపాలని నిర్ణయించింది.
అభరణాల తయారీలో కార్పొరేట్ కంపెనీల ప్రవేశంతో స్వర్ణకారుల జీవితాలు మసిబారాయి. దీంతో వారిపైనా కేసీఆర్ సర్కారు దృష్టిపెట్టింది. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్లో శిబిరాలను ఏర్పాటు చేసి ఆధునిక క్యాడ్ మిషన్పై ఉంగరాలు, ఆభరణాలు, విగ్రహాలను ఎలా తయారు చేయాలి? ఏ విధంగా కొత్త డిజైన్లు రూపొందించాలి? స్వల్పకాలంలో రాళ్లను ఎలా పొదగాలి? తదితర అంశాలతో పాటు హాల్మార్కింగ్ పద్ధతులపై అవగాహన కల్పించింది.
నాయీ బ్రాహ్మణులు, రజకులకు తొలివిడతగా 1000 మంది నాయీబ్రాహ్మణ యువతకు బ్యూటీషియన్, అధునాతన హెయిర్ ైస్టెల్స్, ఫేషియల్, స్పా తదితరాలపై తర్ఫీదునిప్పించింది. రజకులకు అధునాతన డ్రైక్లీనింగ్ యంత్రాల నిర్వహణపై శిక్షణ ఇప్పిస్తున్నది. ఆధునిక దోబీఘాట్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే సిద్దిపేటలో రూ.20 కోట్లతో ఆధునిక దోబీఘాట్ను నిర్మించింది. ఇతర జిల్లాల్లోనూ నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది.
చేతివృత్తులు దేశ ప్రాచీన సంస్కృతిలో ఒక భాగం. అదీగాక పర్యావరణానికి హాని చేయవు. వాటిని ఆధునీకరించి, ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. తద్వారా ఉపాధి కూడా పొందవచ్చు. ఇప్పటికే ఆ దిశగా అనేక ప్రణాళికలను సిద్ధం చేశాం. దశలవారీగా ఒక్కో చేతివృత్తిని సంస్కరిస్తున్నాం. వృత్తిదారులకు శిక్షణ ఇవ్వటం, ఉపకరణాల అందజేత, ఉత్పత్తులకు మార్కెటింగ్కు ప్రణాళికలను సిద్ధం చేశాం.
–బుర్రా వెంకటేశం గౌడ్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి
ఆధునిక యంత్రాలపై ఆభరణాలను తయారుచేసే శిక్షణకు ముంబై, బెంగళూరు, ఢిల్లీకి పోవాలి. అదీగాక వసతి, భోజనం తదితర వాటికి లక్షలు వెచ్చించాలి. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా యువతకు శిక్షణ ఇప్పిస్తున్నది. నేను కూడా గత శిబిరంలో శిక్షణ తీసుకొన్నా. సబ్సిడీపై ప్రభుత్వం పరికరాలను కూడా అందజేసింది.
–బందనకంటి శ్రీనివాసాచారి, స్వర్ణకారుడు, నిజామాబాద్
ప్లాస్టిక్తో వెదురు ఉత్పత్తులకు గిరాకీ తగ్గి సంక్షోభంలో కూరుకుపోయిన మేదరి కులవృత్తికి కొత్తబాటలు చూపాలని అధికారులతో ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం చేయించింది. మేదరి కులస్థులను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి వస్తువుల తయారీ పద్ధతులపై అవగాహన కల్పించింది. త్రిపుర నుంచి నిపుణులను తీసుకొచ్చి విడతలవారీగా గృహాలంకరణ వస్తువుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. 150 రకాల వస్తువుల తయారీలో నైపుణ్యాన్ని పెంపొందించింది. వీరికి ఉపాధి కల్పించేందుకు ఆమనగల్లులో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.
కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్న శాలివాహనులకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటున్నది. గుజరాత్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టాల్లో మట్టితో తయారు చేస్తున్న వస్తువులపై అధ్యాయం చేయించడంతో పాటు, వృత్తిదారులను స్వయంగా అక్కడికి తీసుకెళ్లి అవగాహన కల్పించింది. ఆధునిక యంత్ర పరికరాలను తెప్పించి వాటిపై తొలివిడతగా 350 మంది వృత్తిదారులకు శిక్షణ ఇప్పించింది. వీరికోసం సిద్దిపేటలో రెండెకరాల స్థలాన్ని కేటాయించి, 400 కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆధునిక బట్టీలను నిర్మించాలని యోచిస్తున్నది.