ముందుగా కేజీబీవీ, మోడల్స్కూల్స్లో..
ఎస్సెస్సీ పరీక్షలు ముగియగానే ప్రభుత్వ, పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): వచ్చేనెల టీచర్ల బదిలీలు ఉంటాయని, ఇందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు తెలిపారు. జూన్ మొదటి వారంలో కేజీబీవీ, మోడల్ స్కూల్ టీచర్లు, జూన్ మూడో వారంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు జరుగుతాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని వెల్లడించారు.
మంగళవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పదోన్నతులు, బదిలీలపై పీఆర్టీయూ పక్షాన పలు సూచనలు చేసినట్టు వారు తెలిపారు. మరో వారం రోజుల్లో ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, పరీక్షలు ముగియగానే బదిలీలు, పదోన్నతులు ఉంటాయని పేర్కొన్నారు. పండిట్, పీఈటీల అప్గ్రెడేషన్పై కోర్టు వాయిదా జూన్ 17న ఉన్నందున, తదుపరి కోర్టు తీర్పును అనుసరించి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పీఎస్ హెచ్ఎం పోస్టులను 10 వేలకు పెంచుతూ రూపొందించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయని, దీంతో సుమారుగా 25 వేల పైచిలుకు ప్రభుత్వ, పంచాయితీరాజ్ టీచర్లు పదోన్నతులు పొందుతారని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.
ఉనికికోసం ధర్నాలు తగదు
పదోన్నతుల కోసం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, సూచనలు తీసుకుని జూన్లో పదోన్నతుల షెడ్యూల్ను ప్రకటిస్తామని ముందే ప్రకటించినా కొన్ని సంఘాలు ఉనికి కోసం ధర్నాలు చేయడం తగదని శ్రీపాల్రెడ్డి, కమలాకర్రావు హితవు పలికారు.
అప్పీళ్లను పరిష్కరించి పదోన్నతులు చేపట్టాలి
ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్లో ఉన్న జీవో -317 అప్పీళ్లను పరిష్కరించి, ఆ తర్వాతే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరుతూ టీఆర్టీఎఫ్ నేతలు మంత్రి పీ సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. స్పౌజ్కేసులు, పరస్పర బదిలీలను పూర్తిచేసే పదోన్నతులు, బదిలీలు చేపడితే న్యాయపరమైన చిక్కులు రావని చెప్పారు. అనంతరం ఈహెచ్ఎస్కు ఉద్యోగుల మూలవేతనం నుంచి 2 శాతం మినహాయింపు సమ్మతి లేఖను సీఎస్ సోమేశ్కుమార్కు అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ తదితరులు వినతిపత్రాలు సమర్పించిన వారిలో ఉన్నారు.