హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్గా టీ హబ్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకొని ఢిల్లీలో ఆదివారం జరిగిన నేషనల్ టెక్నాలజీ వీక్-2003 కార్యక్రమంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ చేతులమీదుగా టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ఈ అవార్డును అందుకున్నారు. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును టీ హబ్ ఫిబ్రవరిలో అందుకున్నది. నాలుగు నెలల వ్యవధిలోనే టీ హబ్కు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు రావడం తెలంగాణకే గర్వకారణమని ఐటీశాఖ అధికారులు తెలిపారు. టీ హబ్కు నేషనల్ టెక్నాలజీ అవార్డు రావడం ఆనందంగా ఉన్నదని సీఈవో ఎంఎస్ రావు చెప్పారు. ఈ అవార్డు హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఆవిషరణలు, స్టార్టప్ల విస్తరణ కార్యకలాపాల్లో మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పారు. దేశంలో శక్తివంతమైన, విజయవంతమైన స్టార్టప్ల ఎకోసిస్టంను నిర్మించేందుకు టీ హబ్ అనుసరిస్తున్న విధా నం ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.
టీ హబ్ సాధించిన విజయాల పట్ల సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేషనల్ టెక్నాలజీ అవార్డు-2023ను టీ హబ్ గెలుచుకున్నందుకు గర్వంగా కూడా ఉన్నదని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీ హబ్ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. టీహబ్ భారతదేశంలో బెస్ట్ టెక్నాలజీ ఇంక్యుబెటర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా గుర్తింపు పొందిందని కేటీఆర్ వెల్లడించారు.