హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థికరంగానికి ప్రధాన ఆదాయ మార్గాలలో టీడీఎస్ ఒకటని టీడీఎస్ హైదరాబాద్ ఆదాయ పన్ను కమిషనర్ కే మేఘనాథ్ హాన్ తెలిపారు. మంగళవారం ఆదాయ పన్ను చెల్లింపులు, సమస్యలపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడుతూ.. నిరుడు తెలంగాణ, ఏపీలో 80కిపైగా వెబినార్లు నిర్వహించామని చెప్పారు. టీడీఎస్లో ఢిల్లీ, చెన్నై, పుణె తర్వాత ఆరోస్థానంలో హైదరాబాద్ ఉన్నదని పేర్కొన్నారు. టీడీఎస్ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని, అందుకే నిత్యం అప్డేట్ కావాలని సూచించారు. ఎఫ్టీసీసీఐ డైరెక్ట్ ట్యాక్స్ కమిటీ చైర్మన్ హరి గోవింద్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రీన్ రెవల్యూషన్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.