హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి బదలాయింపు హక్కు (ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్) పత్రాలకు డిమాం డ్ పెరగనున్నది. సర్టిఫికెట్ల వినియోగ పరిధిని పెంచడంతోపాటు వీటి వినియోగంతో అనుమతిలేని నిర్మాణాల క్రమబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ చట్టంలో సవరణలు చేస్తూ జీవో జారీచేసింది. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న రహదారుల నిర్మాణంలో భా గంగా భూసేకరణకు ప్రభుత్వం పెద్దఎత్తున టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నది. టీడీఆర్ వినియోగ పరిధి అవుటర్ రింగ్రోడ్డు వరకు ఉండగా, దాన్ని హెచ్ఎండీఏ పరిధి వరకు పెంచింది.
గ్రేటర్ హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం భూసేకరణ చేపడుతున్నది. ప్రధానంగా రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ క్రమంలో భూసేకరణ, ఆస్తుల సేకరణ సందర్భం గా ఇచ్చే నగదు నష్టపరిహారానికి బదులు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మాస్టర్ప్లాన్ రహదారుల వెడల్పులో భాగంగా సేకరించిన ఆస్తులకు వాటి విలువపై 400 శాతం, చెరువులు, కుంటల్లో 200 శాతం, చారిత్రక కట్టడాలకు 100 శాతం విలువైన టీడీఆర్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. 2017 నుంచి ఈ ఏడాది అక్టోబరు 17 వరకు దాదాపు రూ.4వేల కోట్ల విలువైన 1,802 టీడీఆర్లను జారీ చేశారు. దేశంలో మరే నగరంలో లేనివిధంగా రికార్డు స్థాయిలో టీడీఆర్లను జీహెచ్ఎంసీ స్థలాలు, ఆస్తులు కోల్పోయిన వారికి అందించింది. ఈ మేరకు సోమవారం పురపాలక శాఖ జీవో (235) జారీ చేయగా, జీహెచ్ఎంసీ మంగళవారం అధికారికంగా ఆ వివరాల్ని విడుదల చేసింది.
టీడీఆర్ సర్టిఫికెట్ల వినియోగం అవుటర్ రింగు రోడ్డు వరకు పెంచడంతో గ్రేటర్ పరిధిలోని 4 జిల్లాలతోపాటు యాదాద్రి-భువనగిరి, నల్లగొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధి వరకు ఈ సర్టిఫికెట్లను వినియోగించుకొనే వెసులుబాటు లభించినట్టయింది.
టీడీఆర్ సర్టిఫికెట్ల వినియోగం అదనపు అంతస్తులకు మాత్రమే పరిమితమైంది. తాజాగా చేసిన చట్ట సవరణలో ముందస్తు అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణ క్రమబద్ధీకరణకు కూడా టీడీఆర్ను వినియోగించుకోవచ్చు. అనుమతి లేకపోయినా సదరు నిర్మాణానికి నిబంధనల ప్రకారం, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ తప్పనిసరిగా ఉండాలి. అలాంటి నిర్మాణాల క్రమబద్ధీకరణలో నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన 33 శాతం కాంపౌండింగ్ ఫీజు కింద అంతే విలువైన టీడీఆర్ సర్టిఫికెట్లను సమర్పిస్తే సరిపోతుంది.