హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై వైసీపీ, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆంధ్రాలో అంబేద్కర్ విగ్రహం పెడతామని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహాన్ని తోట చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని భారతజాతి గర్వపడేలా తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దిందని చెప్పారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ సమానత్వ మూర్తిని నెలకొల్పినందుకు సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించటంలో ఏపీని పాలించిన రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని పెడతామని, రాజధాని అమరావతి ప్రాంతంలో సృ్మతివనాన్ని ఏర్పాటు చేస్తామని గత తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి, నాలుగేండ్లు గడిచినా 20 శాతం పనులు కూడా చేయలేదని చెప్పారు. దళితులను వైసీపీ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని, ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా దారి మళ్లించిందని ఆరోపించారు. అంబేద్కర్ని గౌరవించే బాధ్యత ఏపీ పాలకులకు లేదా? అని ప్రశ్నించారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ తెలంగాణ సీఎం కేసీఆర్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.