Chandrababu Naidu | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో జట్టుకట్టి ఎన్నికల సమరంలో దిగుతున్న చంద్రబాబు, తెలంగాణలోనూ బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్నారు. బీజేపీతో ఎలానూ పొత్తుపెట్టుకున్నాం కాబ ట్టి అది తెలంగాణకూ వర్తిస్తుందని, ఖమ్మం సీటు తమకు కేటాయించాలని ప్రతిపాదన తీసుకొచ్చినట్టు సమాచారం. ఖమ్మంలో తమకు మంచి క్యాడర్ ఉందని చెప్పిన చంద్రబాబు.. కులసమీకరణ పరంగా చూసుకున్నా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి ఆ సీటును ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. చంద్రబాబు ప్రతిపాదనను ఢిల్లీ పెద్ద లు కూడా సీరియస్గా తీసుకుని లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. ఖమ్మంలో టీడీపీకి టికెట్ ఇస్తే, గ్రేటర్ హైదరాబాద్లో ఆ ప్రభావం కనిపిస్తుందని, ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నదట.
ప్రతిపక్షాలకు అస్త్రం
బీజేపీ ఇప్పటి వరకు 15 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా వరంగల్, ఖమ్మం మాత్ర మే పెండింగులో ఉన్నాయి. రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన అరూరి రమేశ్కు వరంగల్ టికెట్ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతుండగా, మిగిలిన ఖమ్మం సీటును టీడీపీకి ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం కూడా యోచిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సహా సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. బాబుతో పొత్తును ఏపీకే పరిమితం చేయాలని, టీడీపీకి ఖమ్మం స్థానాన్ని ఇవ్వడం ద్వారా ఇతర పార్టీలకు లక్ష్యంగా మారొద్దని సూచించినట్టు తెలిసింది. కొంద రు నేతలు మాత్రం ఈ ప్రతిపాదన వల్ల బీజేపీ కొంత లాభపడే అవకాశం ఉన్నదని చెప్తున్నారట. ఎలాగూ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే టికెట్లు ఇస్తున్నప్పుడు అదేదో టీడీపీకే ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ బలం పెరుగుతుందని సలహా ఇస్తున్నారట. చర్చలు ఫలించి టీడీపీకి ఖమ్మం టికెట్ కేటాయిస్తే, అదే స్థానం నుంచి టికెట్ ఆశించి పార్టీలో చేరిన జలగం వెంకట్రావు పరిస్థితి ఏమిటన్న చర్చ పార్టీలో మొదలైంది.