న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కొవిడ్-19 సంక్షోభంతో ఆవిర్భవించిన ‘వర్క్ ఫ్రం హోం’ కాన్సెప్ట్కు క్రమేపీ చెక్ పడుతోంది. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో ఉద్యోగుల్ని ఆఫీసుల నుంచి పనిచేయమని ఐటీ దిగ్గజ కంపెనీలు కోరుతున్నాయి. ఆఫీసులకు రావడం లేదా హైబ్రిడ్ రూపంలో పనిచేయమని టీసీఎస్, విప్రో, ఇన్పోసిస్ తదితర కంపెనీలు ఉద్యోగుల్ని ఆదేశిస్తున్నాయి. 2-3 రోజులు ఇంటినుంచి, 2-3 రోజులు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని హైబ్రిడ్ వర్కింగ్ స్టయిల్గా వ్యవహరిస్తారు. ఏ కంపెనీ ఏమంటున్నదంటే…
కొవిడ్ కారణంగా 18 నెలలపాటు ఇంటినుంచి పనిచేసిన తమ లీడర్స్ సోమవారం నుంచి ఆఫీసు రావడం ప్రారంభించారని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ ట్వీట్చేశారు. ప్రస్తుతానికి వారు వారానికి రెండు రోజు లు ఆఫీస్కు వస్తారు.
ఆఫీసు నుంచి పనిని ప్రారంభించేందుకు 80 శాతం ఉద్యోగుల్ని పిలవబోతున్నట్లు టీసీఎస్ తెలిపింది. తమ ఉద్యోగుల్లో 90 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందని, కొవిడ్-19 మూడోవేవ్ పరిస్థితికి అనుగుణంగా 2021 సంవత్సరాంతానికి లేదా వచ్చే సంవత్సరం తొలిరోజుల్లో 70-80 శాతం ఉద్యోగుల్ని ఆఫీసుల నుంచే పనిచేయించనున్నట్లు టీసీఎస్ సీఈవో రాజేష్ తెలిపారు.
ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఆఫీసుల్ని తిరిగి తెరిచేందుకు సిద్ధమయ్యింది. ఇన్ఫోసిస్ క్యాంపస్ల నుంచి పనిచేసేందుకు టీమ్ సభ్యుల్ని అనుమతించాలంటూ తమ టీమ్ లీడర్లు కొందరు కోరుతున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. మరి కొందరు ఆఫీస్ నుంచి పనిచేయడానికి ఆసక్తి తెలియపరుస్తున్నారని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం ఇండియాలో తమ ఉద్యోగుల్లో 3 శాతంమంది ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నారని హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వీవీ తెలిపారు.
నాస్కామ్ తన ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా ఆఫీసులను తెరిచింది. హైబ్రిడ్ వర్క్ మోడల్ను అవలంబిస్తున్నామని, 30% అటెండెన్స్ ను అనుమతిస్తున్నట్లు చెప్పింది.