TB Vaccine | హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): టీబీ నుంచి రక్షణ కోసం అభివృద్ధి చేసిన ‘ఎంటీబీవ్యాక్’ టీకా క్లినికల్ ట్రయల్స్ను భారత్లో ప్రారంభించినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. బయోఫాబ్రీ అనే సంస్థతో కలిసి ఈ పరిశోధనలు చేస్తున్నట్టు పేర్కొన్నది. ఆదివారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసింది. టీబీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 16 లక్షల మంది మరణిస్తున్నట్టు పేర్కొంది.
అత్యధిక మరణాలు నమోదయ్యే దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని తెలిపింది. దాదాపు మూడు దశాబ్దాల పరిశోధన అనంతరం ఈ టీకాను కనుగొన్నట్టు సంస్థ సీసీవో ఎస్టెబన్ రోడ్రిగేజ్ చెప్పారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. దేశంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కావడం టీబీని తరిమికొట్టే ఉద్యమానికి గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ఇప్పటికే అనేక దశల పరీక్షల్లో విజయవంతమైందని చెప్పారు.