సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. దేశానికి ఆర్థిక వనరులు సమకూర్చడంలో రాష్ర్టానిది నాలుగో స్థానం. తెలంగాణ ఏర్పాటుకు ముందు జీఎస్డీపీ రూ.4.90 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.11.50 లక్షల కోట్లకు చేరింది. ఎనిమిదేండ్లలో 130 శాతం వృద్ధి నమోదు చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉండగా, 2.78 లక్షలకు చేరింది. – మంత్రి కేటీఆర్
సంగారెడ్డి, మార్చి 8 : మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో వారికి 10 శాతం స్థలం ప్రత్యేకంగా కేటాయిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. పెట్టుబడుల్లో వారికి 10 శాతం సబ్సిడీ కూడా అందజేస్తామని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఏరోస్పేస్, డిఫెన్స్, మెడికల్ డివైజెస్, సైప్లె చైన్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పూర్లో ఫిక్కీ మహిళా పార్కును ఆయన ప్రారంభించారు. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం 50 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించగా, ఇందులో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించి, పార్కు పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పారిశ్రామిక పార్కు విస్తరణ కోసం మరో 50 నుంచి 100 ఎకరాల స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ఫిక్కీకి కేటాయించిన 50 ఎకరాల స్థలంలో ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలు కంపెనీలు ప్రారంభించారని, మిగతా సభ్యు లు పరిశ్రమలను ప్రారంభించాలని కోరారు. ఈ పార్కు కొత్త ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడుతుందని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి ఉద్యామిక
సీఎం కేసీఆర్ తీసుకొంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ర్టానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 15 రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నదని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి ‘ఉద్యామిక’ పేరుతో కొత్త విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలను ఈ విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకొంటుందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలు సులభంగా వ్యాపారం చేసుకొనేలా కార్పస్ ఫండ్ను ఉద్యామిక ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో మొదటి సారి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన వీ-హబ్ సేవలను పొందాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. వీ-హబ్ 5 వేల మంది వ్యవస్థాపకులతో పనిచేస్తున్నదని, ఇప్పటివరకు 150 స్టార్టప్లను ప్రారంభించి, రూ.65 కోట్లకుపైగా నిధులు సమీకరించినట్టు వివరించారు.
ఎనిమిదేండ్లలో జీఎస్డీపీ 130 శాతం వృద్ధి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామా రావు చెప్పారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని తెలిపారు. దేశానికి ఆర్థిక వనరులు సమకూర్చడంలో నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు జీఎస్డీపీ రూ.4.90 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.11.50 లక్షల కోట్లకు చేరిందని, ఎనిమిదేండ్లలో 130 శాతం వృద్ధి నమోదు చేసిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉండగా, ప్రస్తుతం 125 శాతం వృద్ధి సాధించి 2.78 లక్షలకు చేరిందని చెప్పారు. టీఎస్ఐపాస్ ద్వారా 18 వేల పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చామని, వాటి ద్వారా 16 లక్షల మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ కేంద్రం గా, బల్క్డ్రగ్, ఫార్మా రాజధానిగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఎస్ఐఐసీ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, టీఎస్ఐపాస్ సీఈవో మధుసూదన్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధు లు జోత్స్య అంగార, అజిత యోగేశ్, పింకీరెడ్డి, వాణి సుభాష్, కవిత దత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటున్నది
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామిక పార్కు ప్రారంభించడం ఆనందంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నది. మహిళా పారిశ్రామిక పార్కుల్లో మరింత పెట్టుబడులు వచ్చేలా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కృషి చేస్తున్నది.
– ఉజ్వల సింఘానియా, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షురాలు
పార్కులో రెండువేల మందికి ఉపాధి
కొత్త ఇండస్ట్రియల్ పార్కులో 25 మంది మహిళల యాజమాన్యంలో తయారీ పరిశ్రమలు ఉంటాయి. రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టి, 2వేల మందికి ఉపాధి కల్పించనున్నాం. ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్, ఫర్నిచర్, జనరల్ ఇంజినీరింగ్, ఫుడ్ప్రాసెసింగ్, మెడికల్ డివైజ్లు, ఆభరణాలు, న్యూట్రాస్యూటికల్స్, ఆటో విడిభాగాల యూనిట్లు ఏర్పాటవుతాయి.
– ఉమా చిగురుపాటి, ఫ్లో హైదరాబాద్ చైర్పర్సన్
మహిళలు ముందుకు రావాలి
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామిక పార్కు ప్రారంభించడం సంతోషంగా ఉన్నది. సంప్రదాయ వ్యాపారాలకు పరిమితం కాకుండా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి మహిళలకు ఉపాధి కల్పించాలి. – జయేశ్రంజన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి