వికారాబాద్,ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందిపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఔదార్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. అక్కడక్కడా ఉద్యోగులు చేతివాటం మానడంలేదు. వికారాబాద్ రెవెన్యూ కార్యాలయం సిబ్బంది ఏకంగా తాసిల్దార్ డిజిటల్ కీ నే తస్కరించి రూ.3.50 కోట్ల విలువైన 7.12 ఎకరాల భూమిని అసలైన పట్టాదారుకు తెలియకుండానే ఇతరుల పేరిట బదలాయించేశారు. స్థానికంగా నివాసం లేనివారి భూములను గుర్తించి వారికి తెలియకుండానే కొందరు రియల్టర్లు తమ పేరుపై భూములను ఆన్లైన్లో నమోదుచేయించుకొని.. ఆపై అమ్ముకొన్నారు. రియల్బ్రోకర్లతో చేతులు కలిపిన రెవెన్యూ సిబ్బంది వికారాబాద్ మండలం బూర్గుపల్లి గ్రామంలోని సర్వేనంబర్ 18 లో 7.12 ఎకరాలకు సంబంధించి రికార్డులు మాయంచేశారు. నకిలీ ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీని తయారుచేసి.. తాసిల్దార్ డిజిటల్ కీ దొంగతనంచేసి దాని ఆధారంగా ఆన్లైన్లో పొందుపరిచారు.
రాష్ట్రవ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి సమయంలోనే రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు తెరతీశారు. బూర్గుపల్లి సర్వే నంబర్18లో హైదరాబాద్ నివాసి ఇంతియాజ్కు 7.12 ఎకరాల(రూ.3.50 కోట్ల విలువ) భూమిని కంప్యూటర్ ఆపరేటర్లు ఖలీద్ పేరిట రికార్డులు ఏమార్చారు. 2020 ఆగస్టులో ఈ మార్పిడి జరిగినట్టు అధికారులు గుర్తించారు. తాసిల్దార్కు ఎలాంటి సమాచారం లేకుండా నకిలీ ఆర్డర్ కాపీని ఆన్లైన్లో ఎంట్రీచేశారు. దీని ఆధారంగా అసలు పట్టాదారు అయిన ఇంతియాజ్ పేరును తొలిగించి ఖలీద్ అనే వ్యక్తి పేరిట భూమార్పిడి చేసేశారు. ఖలీద్ ఈ భూమిని ఇంకో వ్యక్తికి విక్రయించాడు. ఆ వ్యక్తి తనకు పట్టా పుస్తకం రాకపోవడంతో వికారాబాద్ కలెక్టర్ను ఆశ్రయించారు. సాధారణంగా రెవెన్యూ కార్యాలయంలో ప్రతి దానికీ ఒక ఫైల్ ఉంటుంది. ఈ భూమికి సంబంధించి ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు కనిపించలేదు. ధరణి పోర్టల్ వచ్చిన తరువాత రికార్డులన్నీ ఆన్లైన్ అవుతున్నాయి. లింక్ డాక్యుమెంట్ లేకుండా ఆన్లైన్ చేయడం సాధ్యం కాదు. దీంతో ఖలీద్ నుంచి భూమిని కొన్న వ్యక్తికి పాస్పుస్తకం రాలేదు. భూమికి అసలు పట్టాదారు అయిన ఇంతియాజ్ తన వ్యవసాయభూమిని ఎలా మార్చారో అర్థంకాక.. అధికారుల చుట్టూ తిరిగాడు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన అధికారులు, తమ కార్యాలయ సిబ్బంది పనేనని తెలిసి విస్తుపోయారు. ఈ వ్యవహారంపై విచారించాలని తాసిల్దార్ రవీందర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఐదుగురిపై కేసు నమోదుచేసి ముగ్గురిని రిమాండ్కు తరలించారు. తాసిల్దార్కు తెలియకుండానే డిజిటల్ కీని దొంగిలించి ఆయన లాగిన్ నుంచే రికార్డులను మార్చారని అధికారులు పేర్కొంటున్నారు.