BR Ambedkar | తెలంగాణ రాష్ర్టానికి తలమానికంగా, హుస్సేన్సాగర్ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన, అంబేద్కర్ భారీ విగ్రహమిది. దేశంలోనే అతిభారీ విగ్రహమైన ఈ మూర్తి వద్దకు, బాబా సాహెబ్ జయంతి సందర్భంగా వందలాది మంది వచ్చి నివాళులు అర్పించారు. నీలి రంగు జెండాలతో నినాదాలు చేస్తూ ఫొటోలు దిగారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిపొందిన ఈ విగ్రహానికి ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీస అలంకరణ చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది.
ప్రభుత్వ ప్రముఖులు గానీ, పార్టీల నేతలు గానీ ఇటు కన్నెత్తి చూడకపోవడం, కనీసం పుష్పగుచ్ఛాలను సైతం సమర్పించకపోవడం పట్ల అంబేద్కర్ అభిమానుల నుంచి అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తమయ్యాయి. 125 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పిన తర్వాత వచ్చిన మొదటి జయంతి ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అంబేద్కర్ జయంతి కూడా ఇదే.ఈ సందర్భాలను గుర్తించి ప్రభుత్వం, అధికారులు ఒక కమిటీని ఏర్పాటు చేసి భారీ విగ్రహం వద్ద ఘనంగా ఉత్సవాలను నిర్వహించి, ప్రజల సందర్శనార్థం గేట్లను బార్లా తెరచి ఉంచితే బాగుండేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తదితరులు ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు తెలంగాణభవన్లో బాబా సాహెబ్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.