ఖమ్మం : టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో 8 మంది నిందితులకు ఖమ్మం జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అనంతరం నిందితులను జిల్లా జైలుకు తరలించారు.
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామ సమీపంలో తమ్మినేని కృష్ణయ్య ఈ నెల 15వ తేదీన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని పొన్నెకల్ రైతు వేదిక వద్ద జాతీయ జెండాను కృష్ణయ్య ఎగురవేశారు. అనంతరం ఆయన తన కారు డ్రైవర్ కే ముత్తేశంతో బైక్పై తెల్దారుపల్లికు తిరిగి వస్తుండగా.. ఆ గ్రామ సమీపంలో బైక్ను ఆటోతో ఢీకొట్టారు. కింద పడ్డ కృష్ణయ్యపై దుండగులు వేట కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు కృష్ణయ్య. అయితే కృష్ణయ్య రెండు చేతులను నరికి తమ వెంట తీసుకెళ్లారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.