వరంగల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పరిశోధనలే లక్ష్యంగా విద్య కొనసాగాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. అందరి మనుగడకు పరిశోధనలు చాలా అవసరమని తెలిపారు. పరిశోధనలతోనే కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొనే పరిస్థితులు వచ్చాయన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. పరిశోధన కోర్సుల్లో మహిళల సంఖ్య ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. గురువారం వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ చాన్సలర్ హోదాలో పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతరం ఆహార అలవాట్లు ఉంటున్నాయని, వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్య బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
విద్యార్థి కుటుంబానికి 2 లక్షల చెక్కు
నయీంనగర్, ఆగస్టు 25 : బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఇటీవల మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి గవర్నర్ రూ.2 లక్షల చెక్కు అందజేశారు. సంగెం మండలం ఎల్గూరు రంగంపేటకు చెందిన విద్యార్థి సంజయ్ కిరణ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. గురువారం వరంగల్కు వచ్చిన గవర్నర్ కేయూ గెస్ట్హౌస్లో బాధిత కుటుంబానికి రూ.రెండు లక్షల చెక్కు అందజేశారు.