హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచిందని తమిళనాడుకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసించారు. మంగళవారం బేగంపేటలోని హోటల్ టూరిస్ట్ ప్లాజాలో తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడుతో కలిసి తమిళనాడు ఫార్మర్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముత్తు విశ్వనాథం, సెక్రెటరీ వీ శివకుమార్, కొవైల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వీ ముంద్రాచలం, కొవైల్ డిస్ట్రిక్స్ కన్వీనర్ ఎన్ కాలిముత్తుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
రైతునేతలతో పాటు పలువురు గత రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, నంది పంప్హౌస్, మల్లన్నసాగర్ తదితర అనుబంధ ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేసి 36లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీరు అందివ్వడం గొప్పవిషయమన్నారు. తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ జిల్లాలో అనమలాయ్, నల్లూరు నదులపై 60 సంవత్సరాల కిందట 4.25లక్షల ఎకరాల సాగునీరు అందించేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఇంత వరకు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, గోదాముల నిర్మాణం, రుణమాఫీ, రైతులు పండించిన పంటలను కోనుగోలు చేస్తూ తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. త్వరలోనే తమిళనాడులో పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసి, తెలంగాణలో అమలవుతున్న పతకాలు, ప్రాజెక్టులు తమ రాష్ట్రంలో అమలు కోసం ఉద్యమిస్తామన్నారు. ఆహ్వానం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన తమిళనాడు రైతు నేతలకు కోటపాటి ధన్యవాదాలు తెలిపారు.