హైదరాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటారు. న్యూఢిల్లీలో ఎన్సీఆర్బీ, ఎంహెచ్ఏ ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్ (Finger Print ) నిపుణుల కోసం జాతీయ స్థాయిలో పరీక్షలను నిర్వహించింది . ఈ పరీక్షల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన 24 మంది ఏఎస్ఐలు (ASI ’s) తమ ప్రతిభను చాటారు.
ఈ సందర్భంగా శనివారం వారిని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) సన్మానించి అభినందించారు. 24 మంది ఏఎస్ఐలు నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజలు గర్వించేలా (Proud) తమ ప్రతిభను చాటడం హర్షనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు శాంతి భద్రతలు (Law and Order), ఆధునిక టెక్నాలజీతో నేరాల అదుపు తదితర అంశాల్లో అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
ఇటీవల టెన్నీస్, బ్యాడ్మింటర్, చెస్ పోటీల్లోనూ తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని అన్నారు. వేలిముద్ర నిపుణులు తమ విధి నిర్వహణలో ఎప్పటికప్పుడే నైపుణ్యాలను నేర్చుకొని పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు. సీఐడీ ఏడీజీపీ మహేశ్ భగవత్ డీజీపీ అంజనీకుమార్ నిరంతర ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే పోలీసు శాఖకు గౌరవం దక్కుతుందని వెల్లడించారు.