హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు మెరిశారు. మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి చెందిన ఫస్టియర్ విద్యార్థులు 11,999 మంది హాజరు కాగా, 10,563 మంది (88.03 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 11,456 మంది హాజరు కాగా, 10,680 మంది (93.23 శాతం) పాసయ్యారు. 41 కాలేజీల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ విద్యను తలదన్నేలా గురుకులాల్లో విద్య అందుతున్నదని చెప్పడానికి ఇంటర్ ఫలితాలే నిదర్శమని ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురుకుల ఫలితాలపై మంత్రి కొప్పుల, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ హర్షం ప్రకటించారు.
బీసీ విద్యార్థుల ప్రతిభ
ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 84.81 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 93.84 శాతం పాసయ్యారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు ప్రత్యేకంగా అభినందించారు.
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ హవా
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ విద్యార్థులు సత్తా చాటారు. సెకండియర్ పరీక్షలకు 6,706 మంది హాజరుకాగా, 5,505 మంది (82.09 శాతం) విద్యార్థులు పాసయ్యారు. ఫస్టియర్ పరీక్షకు 6,828 మంది హాజరు కాగా, 5,337 మంది (78.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అంకంపాలెం గురుకులానికి చెందిన తేజావత్ భవనశ్రీ 984 మార్కులు సాధించింది. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ డీ రోనాల్డ్ రోస్ విద్యార్థులు, అధ్యాపకులను అభినందించారు.