హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ర్టానికి ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఒక్క రైలును దేశమంతా తిప్పుతారా? ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణభవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడారు. సింగరేణిపై ప్రధాని మోదీ ఇచ్చిన మాట తప్పారని..ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పలేదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని చెప్పా రు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్రెడ్డి ఏం చేశారో ముందు చెప్పాలని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఏం చేయకుండానే తెలంగాణ అభివృద్ధి చెందిందా? అని ప్రశ్నించారు. మోదీ లాగా కేసీఆర్ కోట్ల రూపాయల విలువ చేసే కోట్లు వేసుకోరని, సింపుల్గా ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులా మాదిరిగా తీసుకువెళుతూ ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.