హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వరదలు సంభవిస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు చేపట్టే ముందస్తు చర్యల గురించి నివేదించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు చర్యలు చేపట్టేందుకు విపత్తుల నిర్వహణ చట్టంలోని 39వ సెక్షన్ ప్రకారం ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయినవారికి సహాయం, పరిహారాన్ని అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద నీటిలో గల్లంతైన మహాలక్ష్మి ఆచూకీ కనుగొనాలని అధికారులను ఆదేశించింది. ఒకవేళ ఆమె మరణించినట్టు తేలితే కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.