హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): టీ హబ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డును దక్కించుకున్నది. జాతీయ స్టార్టప్ అవార్డ్స్-2022 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నుంచి బెస్ట్ ఇంక్యుబేటర్ అవార్డును టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు అందుకున్నారు. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2022 కోసం మొత్తం 17 విభాగాలు, 50 ఉప విభాగాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. జాతీయ స్థాయిలో టీ హబ్కు ఉత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డు దక్కిన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రత్యేకంగా టీ హబ్ బృందాన్ని ప్రశంసించారు.
దేశంలో టీహబ్కు ప్రత్యేక స్థానం
నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2022లో విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉన్నదని అవార్డు అందుకున్న సందర్భంగా టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు చెప్పారు. టీ హబ్కు లభించిన ఈ అవార్డు హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతుందని తెలిపారు. దేశంలో తమకు ప్రత్యేక స్థానం ఉన్నట్టు ఈ అవార్డుతో తేలిందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాలను టీ హబ్లో నిర్వహిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఆవిష్కరణలు, స్టార్టప్ల విస్తరణ కార్యకలాపాల్లో నిరంతరం పనిచేస్తామని తెలిపారు. నైపుణ్యం గలవారిని ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
టీ హబ్ దేశానికే గర్వకారణం
సాధారణంగా ప్రభుత్వాలు ఈ రంగంలో రాణించలేవు. కానీ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కృషి, పట్టుదలతో స్టార్టప్ల రంగంలో టీ హబ్ దేశానికి గర్వకారణంగా మారింది. అలాంటి టీ హబ్కు జాతీయ స్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నది. దేశంలో శక్తివంతమైన, విజయవంతమైన స్టార్టప్ల ఎకోసిస్టంను నిర్మించేందుకు టీ హబ్ అనుసరిస్తున్న విధానం ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తున్నది. టీ హబ్ ద్వారా ఇప్పటివరకు 2500కు పైగా స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పించి, సుమారు 1.9 బిలియన్ల నిధులు స్టార్టప్లకు వచ్చేలా చేశాం. స్టార్టప్ల ద్వారా సుమారు 12 వేల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి.
– జయేశ్ రంజన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి