హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ‘వినూత్న ఉత్పత్తులు, వ్యాపార నమూనాలే స్టార్టప్లకు ముఖ్యమైన పునాదులు. వీటికి నికరంగా నిధుల ప్రవాహం తప్పనిసరి. స్టార్టప్ల పురోగతికి నిధుల భద్రత ఎంతో కీలకం. అయితే అన్ని స్టార్టప్లకు నిధులు అవసరం లేదు. వినియోగదారుల అంతర్దృష్టి, విశ్వాసం మాత్రమే అవసరం’ అని ఇజ్రాయెల్కు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టం నిపుణులు తాల్ కాట్రాన్ పేర్కొన్నారు.
టీఐఈ (ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం సహకారంతో మంగళవారం రాత్రి హెచ్ఐసీసీలో ఓపెన్ మైక్, లీడర్షిప్ సిరీస్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాట్రాన్ మాట్లాడుతూ, కొన్ని స్టార్టప్లు తమ ప్రారంభ నిధులను స్వయంగా సమకూర్చుకోవాల్సి వస్తుందని చెప్పారు. బాహ్య నిధులు లేకుండా స్టార్టప్లు పురోగతి సాధించలేవన్నది అపోహ మాత్రమేనని, ఈ విషయాన్ని ఎన్నో అంకుర సంస్థలు నిరూపించాయని చెప్పారు.
ఇజ్రాయెల్ సైతం స్టార్టప్ల దేశమని, అక్కడ కూడా స్టార్టప్లు ఇక్కడి మాదిరిగానే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అయితే, వారు తెలివితో తమ సమస్యలను అధిగమిస్తూ తమ ప్రయాణాన్ని నిరాటంకంగా కొనసాగిస్తారని అన్నారు. సమస్యల పరిష్కారమే స్టార్టప్ల మంత్రమని, మెరుగైన దైనందిన జీవనానికి కావాల్సిన వస్తువులను కనిపెట్టడమే వీటి ముఖ్యఉద్దేశమని చెప్పారు. టై హైదరాబాద్ అధ్యక్షుడు సురేశ్ రాజు, డైరెక్టర్ భట్ దిట్టకవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.