సమాజంలో ఎదుర్కొనే సమస్యకు పరిష్కారం చూపడం.. ఆలోచన ఉంటే చాలు వారిని ముందుండి నడిపించడం టీ హబ్ ప్రత్యేకత. దీన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ప్రపంచమే సరిహద్దుగా ముందుకు వెళుతున్నది. సాంకేతిక రంగంలో ఉత్సాహం ఉన్న యువతను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 5, 2015లో టీ హబ్ను ప్రారంభించింది. అనేక విజయాలను సొంతం చేసుకొంటూ నేడు 8వ వసంతంలోకి అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా టీ హబ్ ఏర్పాటు, స్టార్టప్ల ప్రోత్సాహం, సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్లకు అత్యంత అనుకూల వాతావరణం నెలకొల్పడమే టీ హబ్ ప్రధాన లక్ష్యం. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కడ ? ఎలా ? వినియోగించాలో తెలియజేసేందుకు ఆయా రంగాలకు చెందిన నిపుణులు టీ హబ్లో నిత్యం అందుబాటులో ఉంటారు. పట్టణాల నుంచి గ్రామాల వరకు స్టార్టప్లు సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేసేందుకు అవకాశం కల్పించేందుకు టీ హబ్ వేదికగా నిలుస్తున్నది. దీన్ని హైదరాబాద్కో, తెలంగాణకో పరిమితం చేయకుండా దేశ,విదేశాలకు చెందిన వారు ఎవరైనా మంచి ఆలోచనలతో ముందుకు వస్తే వారికి టీ హబ్లో స్థానం కల్పించి ఆవిష్కర్తలుగా ఎదిగేందుకు బాటలు వేస్తున్నది. దాని ఫలితంగానే స్టార్టప్ ఎకో సిస్టంలో టీ హబ్కు ప్రత్యేక స్థానం ఉన్నది. తాజాగా 7 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 5న ‘సెలబ్రేటింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ది 6ఎం వే’, ‘కనెక్టింగ్ ది డాట్స్-ది 6ఎం వే’ పేర్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, మూడు ప్రధాన విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన అత్యున్నత స్థాయి సంస్థ టీ హబ్. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో దీని ప్రస్థానం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిఫుల్ ఐటీ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ (నల్సార్) యూనివర్సిటీ ఆఫ్ లా వంటి సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ను నెలకొల్పింది. మొదటిదశలో గచ్చిబౌలి ట్రిఫుల్ ఐటీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన టీ హబ్లో రాష్ట్రం నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి స్టార్టప్లు ఆవిష్కరణలు చేసేందుకు ఆసక్తి చూపాయి. క్రమంగా డిమాండ్ పెరుగుతుండటం, స్థలాభావంతో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్గా టీ హబ్-2ను నిర్మించింది.
తెలంగాణలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు ఆ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేక దృష్టి సారించి టీ హబ్కు అంకురార్పణ చేశారు. స్టార్టప్ ఇంక్యుబేటర్గా టీ హబ్ (టెక్నాలజీ హబ్)ను 2015 నవంబర్ 5న అప్పటి గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. భారతీయ స్టార్టప్,ఇన్నోవేషన్ ఎకో సిస్టంలో టీ హబ్ అంతకంతకూ ఎదుగుతూ అంతర్జాతీయస్థాయికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా పలు కార్పొరేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నది.
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో నిర్మించిన మొదటిదశ టీ హబ్కు అనతికాలంలోనే విశేష స్పందన లభించింది. వందలాది మంది స్టార్టప్లను టీ హబ్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చారు. అయితే స్థలం కొరత ఏర్పడటంతో ప్రభుత్వం టీ హబ్ రెండోదశను నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన టీ హబ్-2 ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్గా మారింది. జూన్ 28న 2022న ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. ఇందులో ఒకేసారి 2 వేల స్టార్టప్లు ఒకే చోట తమ కార్యకలాపాలు నిర్వహించుకొనే అవకాశం ఉన్నది. 5,82,689 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్గా మారింది. దీని నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లు వెచ్చించింది. శాండ్విచ్ ఆకారంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన టీ హబ్-2 భవన నిర్మాణ శైలి ఆకట్టుకోవడమే కాదు..ఆలోచనలు రేకెత్తించేలా తీర్చిదిద్దారు.
ప్రారంభదశలో ఉన్న టెక్నాలజీ స్టార్టప్ల కోసం టీ హబ్లో రుబ్రిక్స్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రోటోటైప్ దశ నుంచి మినిమం వయబు ల్ ప్రొడక్టు (ఎంవీపీ) వరకు ఆయా స్టార్టప్లకు అవసరమైన సహకారాన్ని అందజేస్తారు. 5 నెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ఆలోచన దశ నుంచి ఉత్పత్తులను రూపొందించేందుకు నిపుణులు పనిచేస్తారు. ఉత్పత్తుల రూపకల్పన కోసం రుబ్రిక్స్ను ప్రారంభించారు. ఇందులో ఫిన్టెక్, సస్టెయినబిలిటీ, హెల్త్టెక్, హెచ్ఆర్ టెక్, మొబిలిటీ, ఐవోటీ, ఎంబెడెడ్ సిస్టం, ఎంటర్ప్రైజ్, అగ్రిటెక్ రంగాల్లోని స్టార్టప్లకు ప్రాధాన్యం ఇస్తారు.
అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయస్థాయి స్టార్టప్ ఇంక్యుబేటర్గా టీ హబ్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాల విస్తరణ, పరిశ్రమలతో భాగస్వామ్యం అయ్యేందుకు నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మొత్తంగా ఒక కార్పొరేట్ కంపెనీ తరహాలో స్టార్టప్ కల్చర్ను విశ్వవ్యాప్తం చేస్తున్నది. ప్రస్తుతం సుమారు 50 మంది స్టార్టప్ రంగానికి సంబంధించిన నిపుణులు టీ హబ్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది రెనాల్ట్ నిస్సాన్ కంపెనీతో ఆటోమొబైల్ విభాగంలో రెనాల్ట్ నిస్సాన్ ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరుతో స్టార్టప్ ప్రోత్సాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుతి సుజుకితో కలిసి మొబిలిటీ చాలెంజ్ చేపట్టారు.
భారత్ను ప్రపంచంలోనే నంబర్.1గా నిలపాలంటే ఆవిషరణ (ఇన్నోవేషన్స్), మౌలిక సదుపాయాలు(ఇన్ఫ్రాస్ట్రక్చర్), సమ్మిళితం(ఇన్క్లూజివ్) అనే మూడు సూత్రాలను అనుసరించాలని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. దానికనుగుణంగానే ఆవిష్కరణ రంగాన్ని ప్రోత్సహించేందుకు టెక్నాలజీ హబ్(టీ హబ్)ను ఏర్పాటు చేశారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చారు. వీటితోపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలు, వ్యక్తులను భాగస్వాములను చేస్తూ వివిధ రంగాల్లో వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా హైదరాబాద్ పెట్టుబడులకు కేంద్రంగా మారింది.
ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ నెట్ వర్క్,
టీ హబ్ (టెక్నాలజీ హబ్), టీ వర్క్స్ , వీ హబ్
(ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్).
టీఎస్ఐసీ (తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్), రిచ్ (రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్
సర్కిల్ ఆఫ్ హైదరాబాద్), టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్),
ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ఎన్సీఎఎం (నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్),
ఇమేజ్ (ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్)
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లకు అవసరమైన సహాయ, సహకారాన్ని అందించేందుకు టీ-హబ్లో ల్యాబ్-32 పేరు తో ప్రత్యేక కార్యక్రమం. 3 నెలలు సాగే ఈ కార్యక్రమంలో స్టార్టప్లు అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాలు, వినూత్న ఆలోచనలతో స్టార్టప్లను ప్రారంభించిన వారు వ్యాపారపరంగా ఎలా నిలదొక్కుకోవాలో నిపుణులు శిక్షణ ఇస్తారు. మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎడ్టెక్, ఐవోటీ, హెల్త్టెక్, లీగల్టెక్, ఎంటర్ప్రైజ్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లు వంటి అంశాల్లో స్టార్టప్లు ఏర్పాటు చేసే వారికి ప్రాధాన్యం.
విశేష అనుభవం కలిగిన నిపుణులతో టీ హబ్లో ప్రత్యేక సమావేశాలను కమ్యూనిటీ కనెక్ట్ పేరుతో నిర్వహిస్తున్నారు. కొత్త ఆలోచనలతో స్టార్టప్లను ఏర్పాటు చేసే ఔత్సాహికులను వివిధ రంగాలకు చెందిన కంపెనీల వ్యవస్థాపకులతో ముఖాముఖి ఉంటుంది. ఆలోచన దశ నుంచి దాన్ని ఉత్పత్తిగా మార్చే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను తెలుసుకొనేందుకు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిధులు సమకూర్చుకొనే విషయంలో వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి మద్దతు ఉంటున్నది.
వినూత్న ఆలోచనలతో విభిన్న రంగాలకు చెందిన సమస్యలకు పరిష్కారం చూపే స్టార్టప్లకు సహకరించేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. సుమారు 48 కార్పొరేట్ సంస్థలు టీ హబ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యాయి.
ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్న టీ హబ్ ప్రారంభించి శనివారంతో ఏడేండ్లు పూర్తి కానుండటంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నూతన వెబ్సైట్ ఆవిష్కరణ, ఐటీ రంగానికి చెందిన ప్రతినిధులతోపాటు స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రత్యేక సమావేశాలు, చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. మెంటార్స్, మెంటీస్కు సంబంధించిన హ్యాండ్బుక్ ఆవిష్కరణ, రెబ్బెర్రీ సంస్థతో భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకోనున్నట్టు టీ హబ్ ప్రతినిధి తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సైయెంట్ ఫౌండర్ చైర్మన్, బోర్డు సభ్యుడు బీవీఆర్ మోహన్రెడ్డితోపాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
స్టార్టప్లు సాఫీగా తమ కార్యకలాపాలు నిర్వహించాలంటే అనుకూలమైన వాతావరణం అవసరం. ఇందుకు టీ హబ్ చక్కటి వేదిక. వివిధ రంగాలకు చెందిన నిపుణులతోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులతోనూ కలిసి స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా టీ హబ్ ఉన్నా, దేశ,విదేశాలకు చెందిన వారు స్టార్టప్ను ఏర్పాటు చేయాలని ఆసక్తి ఉంటే వారికి టీ హబ్ను వేదికగా ఎంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నాం. ఇటీవల కార్పొరేట్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ను మూడు ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో నిర్వహించాం. దీనికి చక్కటి స్పందన లభించింది.
– ఎం శ్రీనివాసరావు, సీఈవో, టీ హబ్
సినీ ప్రెన్యూర్-మీడియా టెక్, రెనాల్ట్ నిస్సాన్ ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్ -ఆటోమొబైల్, రుబ్రిక్స్, మాస్టర్క్లాసెస్, కాన్ప్లుయెన్స్, సిటీబ్యాంక్ సోషల్ ఇన్నోవేషన్ ల్యాబ్-ఫిన్టెక్, ల్యాబ్ 32, అటల్ ఇన్నోవేషన్ సెంటర్, టీ ఏంజిల్, డిస్క్ 5, మొబిలిటీ చాలెంజ్, కాలేజ్లలో లాంచ్పాడ్, కిక్స్టార్ట్, టీ-కనెక్ట్, బోయింగ్ బిల్డ్ 2.0, డ్రోన్ టెక్ విత్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇండియా-యుకే వీఆర్ కన్సార్టియం.
జయేశ్ రంజన్ (ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ), పీజే నారాయణ్(డైరెక్టర్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్), బీవీఆర్ మోహన్రెడ్డి (సైయెంట్ ఫౌండర్ చైర్మన్), సీపీ గుర్నాని (టెక్ మహీంద్రా సీఈవో), శశిరెడ్డి (మేనేజింగ్ పార్టనర్-శ్రీ క్యాపిటల్, యాప్ ల్యాబ్ ఫౌండర్), ఫైజన్ ముస్తఫా (నల్సార్ యూనివర్సిటీ వీసీ), రామన్కుమార్ (ఫౌండర్,మాజీ సీఈవో ఎంమోడల్ ఇంక్), శ్రీనిరాజు (చైర్మన్ ఐల్యాబ్స్ గ్రూప్), అజిత్ రంగ్నేకర్ (ఐఎస్బీ పూర్వ డీన్), మదన్ పిల్లుట్ల (డీన్,ఐఎస్బీ)
ప్రస్తుతం టీ హబ్లో ఉన్న స్టార్టప్లు 120కి పైగా..
ఇప్పటివరకు 1500లకు పైగా స్టార్టప్లకు సహకారం.
1100 స్టార్టప్స్ ప్రభావం చూపాయి.
60కి పైగా మెంటార్స్ టీ హబ్తో కలిసి పనిచేస్తున్నారు. 2100 గంటలపాటు విలువైన చర్చలు జరిగాయి.
టీహబ్ కేంద్రంగా స్టార్టప్లకు రూ.1800 కోట్ల ఫండింగ్.
స్టార్టప్ల కోసం 75కు పైగా ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలు.
50కి పైగా సర్వీసు ప్రొవైడర్లతో సంబంధాలు.
52 స్టార్టప్లు విజయవంతం. 20కి పైగా అంశాల్లో నిపుణులతో తరచూ కార్యక్రమాలు.