హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, డాక్టర్ జీ చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల (ముఫకమ్ ఝా) అధినేత జాఫర్ జావేద్ను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోటాలో సీటును ఆశిస్తున్న ఆశావహులు చాలామంది ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని సీనియర్లకు అధిష్ఠానం అవకాశం కల్పించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు మద్దతునిచ్చిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు తెలిసింది. మరో స్థానానికి విద్యాసంస్థల యజమాని జాఫర్ జావేద్కు అవకాశం కల్పించినట్టు చెప్తున్నారు.