యాదాద్రి, జూలై 21 : స్వయంభూ పంచనారసింహుడిగా కొలువైన యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు గురువారం నిజరూపంలో దర్శించుకొని తరించారు. ఉదయం 5:15 గంటలకు స్వామివారి నిజాభిషేకంలో భాగంగా ఆభరణాలు, పూలమాలలు తొలగించి స్వామివారిని నిజరూపంలో అర్చకులు వివిధ రకాల అమృతాలతో అభిషేకించారు.
సాయంత్రం స్వామివారి వెండి మొక్కుజోడు సేవలు, దర్బార్ సేవ, తిరువారాధనలు నిర్వహించారు. సుమారు 8 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.8,27, 060 ఆదాయం సమకూరింది. కాగా, 16 రోజుల హుండీని గురువారం లెక్కించగా రూ.87,40,899 నగదు, 124 గ్రాముల మిశ్రమ బంగారం, 990 గ్రాముల మిశ్రమ వెండి, విదేశీ కరెన్సీ వచ్చినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.