యాదాద్రి, ఆగస్టు 10 : యాదగిరిగుట్టలో స్వయంభువుగా వెలిసిన లక్ష్మీనారసింహుడికి బుధవారం ఆరాధన పర్వాలు పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో సాగాయి. అర్చక బృందం తిరువారాధన, నిజాభిషేకం పర్వాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా నిత్యతిరుకల్యాణతంతు జరిపారు.
సాయంత్రం వేళలో స్వామివారి వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవలను వైభవంగా చేపట్టారు. స్వామివారి ఖజానాకు రూ.12,76, 681 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు. కాగా శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన బుధవారం నాటికి 13వ రోజుకు చేరింది. రోజుకు 3.6 లక్షల నామాలను స్మరిస్తుండగా ఇప్పటివరకు 46.80 లక్షలు పూర్తి చేశారు.