భారత జాతీయ కాంగ్రెస్ అఖిల భారత మహాసభలు 1923 డిసెంబరులో కాకినాడలో జరిగాయి. ఈ మహాసభలో నైజాం ప్రాంతం నుంచి వంద మంది వరకు ప్రతినిధులు పాల్గొన్నారు.
వీరిలో తెలంగాణ, మహారాష్ర్ట, కర్నాటక సభ్యులున్నారు. ఆ మహాసభల్లో వీరంతో కలిసి ‘హైదరాబాద్ జాతీయ మహాసభ’ పేరుతో ఒక సభ నిర్వహించారు. దీనికి వామన్రావునాయక్ అధ్యక్షత వహించారు. ఆ మహాసభల ప్రభావంతో నిజాం రాజ్యంలోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని అరవై మంది సంతకాలు చేసి నిజాంకు వినతిపత్రం పంపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోరిన వారందరినీ దేశ బహిష్కారం చేస్తారేమోనని వాళ్లంతా భయపడ్డారు.
ఈ పరిణామాలపట్ల నిజాం ఆగ్రహంతో ఉన్నాడు. కానీ, అప్పటి కొత్వాల్ వెంకట్రామిరెడ్డి వారిపట్ల సానుభూతి చూపడం, ఆయన రాజకీయ చతురత వల్ల వారంతా ఆ గండం నుంచి గట్టెక్కారు. నిజాంకు వినపతి పత్రం అందిన తర్వాత కొత్వాల్ వెంకట్రామిరెడ్డితో చర్చించాడు. ఆయన వాళ్లపై చర్య తీసుకుంటే ఏదైనా ప్రజలనుంచి వ్యతిరేకత రావొచ్చని, దానివల్ల రాజ్యంలో అగ్గి రాజుకుంటుందని హెచ్చరించాడు. అప్పుడు నిజాం వీరిపట్ల ఉదారంగా వ్యవహరించాడు. కాంగ్రెస్ వాళ్లు గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నారు.