త్రివర్ణ పతాకం.. దేశానికే గర్వకారణం. మువ్వన్నెల జెండాను రూపొందించడంలో తెలుగుబిడ్డ పింగళి వెంకయ్యతోపాటు చాలామంది కృషి ఉంది. అయితే, స్వాతంత్య్రం సిద్ధించాక తొలిసారి ఎర్రకోటపై ఎగిరిన జెండాకు తుదిరూపు ఇచ్చినది మాత్రం మన హైదరాబాదీ బిడ్డ సురయ్యా త్యాబ్జీ.
సురయ్యా త్యాబ్జీ..1919లో హైదరాబాద్లో అమీర్ అలీ, లీలాహసన్ దంపతులకు జన్మించారు. ఆమె తాత అక్బర్ హైదరీ.. నిజాం సంస్థానంలో ప్రధానిగా పనిచేశారు. ఆమెకు బొంబాయికి చెందిన భద్రుద్దీన్ త్యాబ్జీతో వివాహం జరిగింది. ఆయన అప్పటి రాజ్యంగ పరిషత్లో సివిల్ సర్వీస్ అధికారిగా పనిచేస్తుండేవారు. బద్రుద్దీన్ తాత బద్ద్రుద్దీన్ త్యాబ్జీ దాదాబాయ్ నౌరోజీతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. 1887-88 కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. వారి స్ఫూర్తితో సురయ్యా త్యాబ్జీ కూడా స్వాతంత్య్రోద్యమంలో సేవలందించేవారు. చురుకైన ఉద్యమ స్వభావమే ఆమెను అగ్రనాయకులకు పరిచయం చేసింది.
1947లో బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జెండా ప్రదర్శన కమిటీ ఏర్పడింది. జెండా రూపకల్పన కోసం సరోజినీ నాయుడు కన్వీనర్గా ఏర్పాటైన సబ్కమిటీలో సురయ్యా త్యాబ్జీకి స్థానం దక్కింది. జాతీయ పతాకం తుది రూపకల్పన సమావేశాలు సాగుతున్న దశలో సారనాథ్లోని అశోకుడి స్థూపం చర్చకు వచ్చింది. నెహ్రూ, అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణలాంటి అగ్రనేతల సూచనలు ఇందుకు తోడయ్యాయి. పెయింటింగ్లో ప్రతిభావంతురాలైన త్యాబ్జీని జెండా రూపొందించే పనుల్లో భాగస్వామిని చేశారు. ఢిల్లీలోని వైస్ రీగల్ లాడ్జ్(ఇప్పటి రాష్ట్రపతి భవన్)లో ఉన్న ప్రింటింగ్ విభాగం ఆమె కార్యక్షేత్రమైంది. త్రివర్ణ పతాకం మధ్యలో ధర్మచక్రాన్ని ప్రింట్ చేసేందుకు ఆమె గ్రాఫిక్ వర్క్ను ఉపయోగించారు.
ఆమె మొదట ధర్మచక్రాన్ని నలుపు రంగుతో చిత్రించారు. అయితే, అది ఆమోదం పొందలేదు. గాంధీజీ, అంబేద్కర్లాంటి అగ్రనాయకుల సూచనతో ముదురు నీలం రంగులో (నేవీబ్లూ) 24 ఆకులతో కూడిన ధర్మచక్రాన్ని చిత్రించారు. నీలిరంగును బౌద్ధానికి, బహుజన సంస్కృతికి ప్రతీకగా పేర్కొంటారు. చక్రంలోని 24 ఆకులు బౌద్ధ సూత్రాలకు, అశోకుడి 24 శాసనాలకు సంకేతంగా చెబుతారు. ఈ ప్రయత్నంలో సురయ్యాకు భర్త సహకారం కూడా ఎంతో తోడైంది. అకుంఠితమైన జాతీయ భావనను ప్రతిబింబించే త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22న రాజ్యాంగ సభ స్వీకరించింది. 1947 ఆగస్టు 14న ఆమోదిస్తున్నట్టు ప్రొసీడింగ్స్ను విడుదల చేసింది.
త్రివర్ణ పతాకంలో ధర్మచక్రాన్ని రూపొందించడంలో సురయ్యా త్యాబ్జీ పాత్రను ఆమె కూతురు లైలా త్యాబ్జ్జీ 2018లో రాసిన ఒక వ్యాసంలో వివరించారు. ‘బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా జాతీయ జెండా కమిటీని ఏర్పాటు చేశారు. చిత్రకళా పాఠశాలకు డిజైన్లు పంపాలని లేఖలు వెళ్లాయి. వందలాది చిత్రాలు వచ్చిచేరాయి. వాటిలో ఎక్కువ భాగం బ్రిటన్ జాతీయ చిహ్న ప్రభావంతో వేసినవే.
ఈ దశలో వాస్తు, శిల్ప, చిత్ర కళాభిమానులైన మా తల్లిదండ్రులు మనోఫలకం మీద అశోక స్థూపం మీద సింహ శీర్షం మెరిసింది. చరఖా స్థానంలో అశోక స్థంభంలోని ధర్మచక్రం ఉంచినపుడు సహజంగా అమరిపోయింది” అని వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన చరిత్రకారుడు కెప్టెన్ ఎల్ పాండురంగారెడ్డి పరిశోధనలో అశోక ధర్మచక్రంతో కూడిన పతాకాన్ని రూపొందించడంలో సురయ్యా త్యాబ్జీ కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ చర్చలు, డాక్యుమెంట్లు, జెండా ప్రదర్శన కమిటీలో త్యాబ్జ్జీ ఉండడం అందుకు ప్రధాన సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
-డాక్టర్ జే విజయ్కుమార్
(తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్)