ధీరవనితలు సునీతి చౌధరి, శాంతిఘోష్
బాలికలు, మహిళలపై అకృత్యాలు చూసి ఆ చిట్టితల్లులు తెల్లవారిపై కసి పెంచుకున్నారు. బడిలో చదువుకోవాల్సిన వయస్సులో స్వాతంత్య్రంకోసం తుపాకీ పట్టారు. ధైర్యంగా జిల్లా మెజిస్ట్రేట్ను కాల్చేసి ధీరవనితలుగా చరిత్రలో నిలిచిపోయారు సునీతి చౌధరి, శాంతిఘోష్.
1930లో.. బెంగాల్లోని కొమిల్లా (ప్రస్తుత బంగ్లాదేశ్) జిల్లా కేంద్రంలోని ఫైజున్నీసా బాలికల హైస్కూల్లో సునీతి చౌధరి, శాంతిఘోష్ విద్యనభ్యసించేవారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బాలికలు మహిళలపై బ్రిటిషర్ల అకృత్యాలు, వేధింపులను చూసి రగిలిపోయారు.. ఆంగ్లేయులపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. వీరిని సహచర విద్యార్థి ప్రఫుల్లనళినీ బ్రహ్మ.. జుగాంతర్ పార్టీలో చేర్చుకున్నారు. ఓసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కొమిల్లాకు వచ్చారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సునీతి ఆధ్వర్యంలో బాలికల దళం పరేడ్ నిర్వహించడం చూసి సంతోషపడ్డారు. వారి కోరిక మేరకు ఆ బాలికల దళానికి మయాన్మాతి గుట్టల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్చడం నేర్పించారు. ఆ రోజుల్లో తిప్పేరా జిల్లా మేజిస్ట్రేట్ చార్లెస్ జెఫ్రీ బక్లాండ్ స్టీవెన్స్ అరాచకాలకు అడ్డులేకుండా పోయేది. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనేవారిని అధికార మదంతో చిత్రహింసలు పెట్టేవాడు. స్టీవెన్స్పై ప్రతీకారం తీర్చుకునే బాధ్యతను సునీతి, శాంతి తీసుకున్నారు.
1931 డిసెంబరు 14 ఉదయం పది గంటలు..వారిద్దరూ తమ స్కూల్లో స్విమ్మింగ్ క్లబ్ కోసం వినతిపత్రం ఇచ్చే నెపంతో కలెక్టర్ బంగ్లాకు చేరుకున్నారు. మెజిస్ట్రేట్ చార్లెస్ గదికి వెళ్లారు. ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. చార్లెస్ దాన్ని చదువుతుండగా, సునీతి, శాంతి తుపాకీ తీసి దగ్గరనుంచి కాల్చారు. దీంతో చార్లెస్ కుప్పకూలిపోయాడు. అనంతరం వారిద్దరూ పారిపోకుండా, పోలీసులకు లొంగిపోయారు. ఇద్దరూ మైనర్లే కావడంతో పదేండ్ల జైలు శిక్షపడింది. రెండో ప్రపచం యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వంతో గాంధీజీ జరిపిన చర్చల ఫలితంగా ఏడేండ్ల కారాగారవాసం అనంతరం 1939లో సునీతి, శాంతి విడుదలయ్యారు.