బ్రిటిష్ ఇండియాలో జాతీయ ఉద్యమం వేళ్లూనుకుంటున్న నేపథ్యంలో దాని ప్రభావం వల్ల అనేక సంస్కరణోద్యమాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులు హైదరాబాద్ సంస్థానాన్ని కూడా తాకాయి. అణచివేతకు, అవమానాలకు గురవుతున్న దళితుల్లో కులాధిక్య సంకెళ్ల నుంచి బైటపడాలనే ఆలోచనలు మొదలయ్యాయి. రాజధాని ప్రాంతంలో చైతన్యం బాగా విస్తరించింది. ఇందుకు కృషిచేసిన వారిలో భాగ్యరెడ్డివర్మ అగ్రగణ్యులు.
భాగ్యరెడ్డివర్మ..1906లోనే అంటరానివర్గాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు జగన్ మిత్ర మండలి స్థాపించారు. భారతదేశంలోనే దళితోద్యమానికి దీనిని నాందిగా భావించవచ్చు. మిత్రమండలి ఆధ్వర్యంలో 1910లో ఇసామియా బజారు, లింగంపల్లిలో పాఠశాలలను ఏర్పాటు చేశారు. వీటి సంఖ్య పెరగడమేకాకుండా.. దళితుల డిమాండ్ మేరకు వీటి నిర్వహణా బాధ్యతను నిజాం ప్రభుత్వమే చేపట్టింది. 1911లో జగన్ మిత్ర మండలిని మన్య సంఘంగా పేరు మార్చారు. దేవదాసీ, జోగినిలాంటి దురాచారాల నిర్మూలనకు ఈ సంఘం కృషి చేసింది. ఫలితంగా నిజాం ప్రభుత్వం దేవదాసీ వ్యవస్థను నిషేధించింది. 1912లో భాగ్యరెడ్డివర్మ అహింసా సమాజాన్ని ప్రారంభించారు.
ఈ సంస్థ తర్వాత దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్గా మారింది. వారు మూలవాసులని అంటూ ఆదిహిందూ పదం వ్యాప్తిలోకి తెచ్చారు. 1917 సంవత్సరం బెజవాడలో జరిగిన మొదటి ఆంధ్ర పంచమ సదస్సుకు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించారు. అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి జాతీయ నాయకులు ఈ సభకు హాజరయ్యారు. తర్వాతికాలంలో దళితులకు తగిలించే పంచమ లాంటి పేర్లను భాగ్యరెడ్డివర్మ నిరసించారు. దళితుల్లో చైతన్యం తీసుకొస్తున్న భాగ్యరెడ్డి వర్మ.. గాంధీజీ, సరోజినిదేవిలాంటి జాతీయ నాయకుల మన్ననలు పొందారు. జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభలో భాగ్యరెడ్డివర్మ పాల్గొనడమే కాకుండా రెండు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు.
ఆది హిందువులు విద్యావంతులయ్యేందుకు నిజాం ప్రభుత్వం వసతులు కల్పించాలని, హిం దువులు అస్పృశ్యతను విడిచిపెట్టాలని ఆయ న ప్రతిపాదించారు. 1931లో జరిగిన రెండో ఆంధ్ర మహాసభలో బందెల చిత్తారయ్య అధ్యక్షతన ఆది హిందువుల సభను ప్రత్యేకంగా నిర్వహించారు. భాగ్యరెడ్డివర్మ, తదితరులు ప్రసంగించారు. అస్పృశ్యత నివారణ, వెట్టిచాకిరీ నిర్మూలన, దేవాలయ ప్రవేశం, బావుల నుంచి నీళ్లు తోడుకునే హక్కు మొదలైన అంశాలపై ఈ సభలో తీర్మానాలు చేశారు. 1934లోనే ఆది హిందువులకు పది నియోజకవర్గాలు ప్రత్యేకించాలన్న భాగ్యరెడ్డివర్మ 1939లో కన్నుమూశారు.