హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తులు, వన్యప్రాణులకు రక్షిత జోన్గా నడకదారిని అభివృద్ధి చేయాలని శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర స్వామి టీటీడీకి సూచించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి దంపతులు రిషికేశ్ వెళ్లి మంగళవారం స్వరూపానంద్రేంద్ర స్వామితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీటీడీకి స్వరూపానందేంద్ర పలు సూచనలు చేశారు. వసతి గదుల కొరతను త్వరితగతిన అధిగమించాలని, క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులందరికీ అన్నప్రసాదాలు అందేలా చూడాలని,
ప్రభుత్వం మంజూరు చేసిన 700 వేద పారాయణదారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. శ్రీవారికి సమర్పించే కైంకర్యాలపై ఎప్పటికపుడు సమీక్షించాలని, యువతలో ధార్మిక భావాలు పెంపొందించేలా నూతన కార్యక్రమాలు రూపొందించాలని, దళిత, గిరిజన ప్రాంతాల్లో భజన బృందాలకు సామగ్రి అందించాలని సూచించారు. అనంతరం కరుణాకర్రెడ్డి దంపతులు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందస్వామిని కూడా కలిశారు.