హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, అంతర్జాతీయ విత్తన పరీక్షా సంఘం(ఇస్టా) చైర్మన్ డాక్టర్ కే కేశవులు ప్రతిష్ఠాత్మక ఎమ్మెస్ స్వామినాథన్ అవార్డును అందుకొన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారం చెన్నైలో కేశవులుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. పాతికేండ్లుగా వ్యవసాయరంగానికి ముఖ్యంగా విత్తన పరిశోధన, విత్తనరంగ సుస్థిర అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు స్వామినాథన్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది. ఎమ్మెస్ స్వామినాథన్ అవార్డును ఇప్పటివరకు మొత్తం ఏడుగురికి అందజేశారు. వీరిలో ఐదుగురు విదేశీయులు కాగా, ఇద్దరు భారతీయులు. భారత్ నుంచి గతంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఎస్ పరోడా అందుకోగా, ఇప్పుడు కేశవులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ.. హరితవిప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ పేరుతో నెలకొల్పిన ఈ అవార్డును స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఈ స్ఫూర్తితో భారత విత్తనరంగ అభివృద్ధితో పాటు తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. విత్తనరంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ కార్యదక్షతతో తెలంగాణలో వ్యవసాయరంగం రూపురేఖలు మారిపోయాయని, రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు.