హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛ మనసు ఉంటేనే సాధ్యమవుతుందని రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో శనివారం జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఆయన మాట్లాడారు. ప్రాచీన భారతదేశం మూలాల గురించి, గతం గురించి బాగా తెలుసుకోవడం వల్ల గొప్ప భవిష్యత్తును నిర్మించేందుకు వర్తమానం అవకాశం కల్పిస్తుందని స్వామి వివేకానంద చెప్పారని గుర్తుచేశారు. అనంతరం యోగా మాస్టర్ లివాంకర్ సారథ్యంలో విద్యార్థులు చేసిన యోగా ప్రదర్శనలు ఆకట్టుకొన్నాయి. బాలబాలికలు ఆలపించిన దేశ భక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది రవిచందర్, డెక్స్ టెరిటీ వ్యవస్థాపకుడు శరద్ వివేక్సాగర్ తదితరులు పాల్గొన్నారు.