జగిత్యాల: మహాత్ముడి పిలుపుతో స్వతంత్ర పోరాటంలో ఖాదీ తయారీ, చరఖా ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పటి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లిలో ఖాదీ తయారీ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. పట్టణంలో వైద్యనాథ్ అనే వ్యక్తి చరఖా ద్వారా సేవలందించడం మొదలు పెట్టారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా అనే గృహాల్లో చరఖాలు, రాట్నాలు వెలిశాయి.
1929లో మెట్పల్లిలో గాంధీజీ పేరిట భారీ కార్ఖానా స్థాపించారు. దేశ్ముఖ్ వెంకట నర్సింగరావు 14 ఎకరాల స్థలం అందజేశారు. ఈ సంఘం క్రమంగా వృద్ధి చెంది స్వతంత్ర పోరాటానికి వేదికగా మారిపోయింది. ఖాదీ వస్ర్తాలు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మేవారు. ఈ కార్ఖానాలో బోగ పాపయ్య పంతులు అమోఘంగా తన సేవలందించారు. మెట్పల్లి ఖాదీ తన స్వతంత్ర భావావేశాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉంది.