1857 తిరుగుబాటు విఫలమైన తర్వాత భారత్లోని వివిధ సంస్థానాల్లో ఉన్నతోద్యోగాలు చేసే వారికి ఉపాధి పోయింది. ఢిల్లీ, లక్నో నగరాల నుంచి ఎందరో హైదరాబాద్కు వలసబాటపట్టారు. సమర్థులైనవారిని, ప్రతిభావంతులను ఉపయోగించుకునేందుకు ఇక్కడి సర్కారు ఆసక్తి చూపింది.
ఉద్యోగాల్లో ఇతర ప్రాంతాలకు చెందినారి వలసలు కొనసాగడంతో స్థానికుల (ముల్కీ)కే ఉద్యోగాలు ఇవ్వాలని ఇక్కడివారు కోరారు. వారి కోరికను సర్కారు మన్నించింది. సమర్థులైన ముల్కీలకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని 1933లో ఆదేశాలు జారీ చేసింది. కానీ,ఆ ఉత్తర్వులను ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా స్థానికేతరులకు ఉద్యోగాలిచ్చారు.
ముల్కీల హక్కులు కాపాడేందుకు ఒక పౌర సంస్థ అవసరమని భావించిన స్థానిక పెద్దలు ‘నైజాం ప్రజల సంఘం (జమీయత్ రియా యాయె నిజాం)’ ఏర్పాటు చేసుకున్నారు. నవాబ్ నిజామత్ జంగ్ (మాజీ మంత్రి) ఈ సంస్థకు అధ్యక్షుడిగా, డాక్టరు లతీఫ్ సయీద్, రామచంద్ర నాయక్ ఉపాధ్యక్షులుగా, సయ్యద్ ఆబిద్ హసన్, బూర్గుల రామకృష్ణారావు, శ్రీనివాసరావు శర్మ కార్యదర్శులుగా, బారిస్టర్ నౌషీర్ చీనాయ్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. 18 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ దక్కన్లో కుల, మత పక్షపాతం లేని రాజకీయ సంస్థగా నైజాం ప్రజల సంఘం గుర్తింపు పొందింది. ఇందులోని ఒక వర్గం వారు ఒక పార్టీలో చేరడం, మరఠ్వాడా ప్రాంతాల మత రాజకీయ ప్రభావంతో ఈ సంస్థకు కొద్దికాలంలోనే ఆరదణ తగ్గిపోయింది.
నేనే గురువు.. నేనే శిష్యుడు!
జైలు శిక్షను కూడా ఆధ్యాత్మిక చింతనకు ఓ అవకాశంగా మలచుకున్నారు స్వామి రామానంద తీర్థ. స్టేట్ కాంగ్రెస్ నాయకుడిగా సుదీర్ఘజైలు జీవితం గడిపారు. జైలులో తనపై తానే ప్రయోగాలు చేసుకున్నారు. ‘నాలో నేనే ఆలోచించుకుంటూ, వాదించుకుంటూ, కూని రాగాలు తీస్తూ గడిపాను. ఒక్కోసారి నాకు నేనే గురువుగా, శిష్యుడిగా ద్విపాత్రాభినయం చేశాను. నాకు నేను ఒక మౌలికమైన దక్పథాన్ని తీర్చిదిద్దుకునే శక్తిని అలవర్చుకొన్నాను. అది నా ప్రవర్తనకు మార్గసూచిగా ఉపయోగపడింది’ అని స్వామి చెప్పుకుంటారు.