సంగారెడ్డి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఐఐటీ హైదరాబాద్, సుజుకీ మోటర్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన డ్రైవర్హ్రిత వాహనాన్ని త్వరలో పరీక్షించనున్నారు. ఈ వాహనాన్ని పరిశీలించేందుకు సుజుకీ మోటర్ కార్పొరేషన్ సాంకేతిక నిపుణులు, ఉన్నతాధికారులు గురువారం ఐఐటీ హైదరాబాద్కు వచ్చారు. అటానమస్ వాహనాన్ని జపాన్ నుంచి తీసుకొచ్చారు. ఈ పరీక్షల కోసం సెన్సర్లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసింది. డ్రైవ్-బై-వైర్ వాహనాన్ని అటానమస్ వాహనంగా మార్చేందుకు ఐఐటీహెచ్ అభివృద్ధి చేసిన సెన్సర్లు పనిచేస్తాయి. ఈ సెన్సర్లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ పనితీరును సుజుకీమోటర్ కార్పొరేషన్ సాంకేతిక నిపుణులు పరిశీలించారు. ఐఐటీ హైదరాబాద్లోని అటానమస్ నావిగేషన్-డాటా అక్విజిషన్ సిస్టమ్స్(టీ-హాన్) టెస్ట్ బెడ్ను సుజుకీ మోటర్ కార్పొరేషన్ సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జపాన్ నుంచి తీసుకొచ్చిన అటానమస్ వాహనానికి సెన్సర్లు బిగించి టీ హాన్ టెస్ట్ బెడ్లో త్వరలో పరీక్షించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఐఐటీహెచ్ చేస్తున్నది.
మూడేండ్లుగా పరిశోధనలు
డ్రైవర్ రహిత వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీహెచ్ మూడేండ్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్మూర్తి చెప్పారు. ఇందులో సుజుకీ మోటర్ కార్పొరేషన్ ప్రధాన భాగస్వామిగా ఉన్నదన్నారు. భారత్-జపాన్ ద్వైపాక్షిక వృద్ధ్దికి దోహదపడుతుందని వివరించారు.
సంయుక్తంగా వాహనం అభివృద్ధి
భారత్లో వాహనాలు ఢీకొనడం, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలను పరిష్కరించేందుకు అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని ఐఐటీహెచ్ తో కలిసి అభివృద్ధి చేస్తున్నట్టు సుజుకీ మోటర్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కురాచి నోబునారి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవర్ రహిత వాహనాల తయారీకి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంతోపాటు మానవ వనరులను తయారు చేసేందుకు ఐఐటీ హైదరాబాద్తో పనిచేస్తున్నట్టు తెలిపారు.
ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా..
అటానమస్ వాహనాల పనితీరును పరిశీలించేందుకు టీహాన్ అత్యాధునిక టెస్ట్ బెడ్ను తయారు చేసినట్టు టీహాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి తెలిపారు. సుజుకీ మోటర్స్తో కలిసి ఐఐటీ హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా, అనువుగా అటానమస్ వాహనాలకు రూపకల్పన చేయనున్నట్టు పేర్కొన్నారు.