గువాహటి: అస్సాంలోని గువాహటి ఐఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్య పుల్లూరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న ఐశ్వర్య, ఆమె ముగ్గురు స్నేహితులు గువాహటికి వచ్చారు. అంతకుముందే బుక్ చేసిన హోటల్ రూమ్లోకి అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. అప్పటికే వారు మత్తులో ఉన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు. మరునాడు ఐశ్వర్య వాష్ రూమ్ వద్ద స్పృహతప్పి పడి ఉండటంతో ఆమెను గౌహతి మెడికల్ కాలేజీకి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఐశ్వర్య మరణానికి ఐఐటీ సిబ్బంది, విద్యార్థులు సంతాపం తెలిపారు.