కామారెడ్డి/రామారెడ్డి, మే 23: బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన మృతికి బీజేపీ నాయకుడే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో బీజేపీ నాయకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయిపల్లికి చెందిన అధికం నర్సాగౌడ్ (48) గతంలో రెండుసార్లు ఎంపీటీసీగా, ఒకసారి సర్పంచ్గా ఎన్నికయ్యారు. కొద్దిరోజులు ఎంపీపీగా కూడా పని చేశారు. ఆయన భార్య మహేశ్వరి ప్రస్తుతం సర్పంచ్గా కొనసాగుతున్నారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నర్సాగౌడ్.. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి కామారెడ్డిలో ఫంక్షన్ ఉందని, తాను వెళ్తున్నానని చెప్పాడు.
ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. మంగళవారం ఉదయం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు నర్సాగౌడ్గా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి ముఖంపై గాయాలు ఉండటంతో తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కొందరు కక్షగట్టి హత్య చేశారని భార్య ఆరోపించారు. వారం, పది రోజుల నుంచి గ్రామంలో అభివృద్ధి పనుల గురించి గొడవలు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె వివరించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ సురేశ్ తెలిపారు.
కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఏరియా దవాఖానకు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా.. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడే ఈ హత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహంతో ధర్నాకు దిగారు. మృతదేహాన్ని తీసుకుని నేరుగా బీజేపీ నాయకుడు చెన్నం నర్సింహారెడ్డి ఇంటికి చేరుకొని ఆందోళన చేపట్టారు. నర్సాగౌడ్ మృతికి నర్సింహారెడ్డే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ధర్నా విరమించి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.