యాదగిరిగుట్ట: ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందారు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే అయిలయ్య ఇంట్లోని పెంట్ హౌస్లో ఉంటున్నారు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. అయితే ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండు రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను.. ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలంటే సైదాపురంలోని ఇంట్లో ఉరివేసుకుని ఉండ వచ్చునని గ్రామస్తులు అంటున్నారు. భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రాత్రికి రాత్రి రవి మృత దేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని అయిలయ్య సందర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో గంధమల్ల రవి పలు కారణాలతో మృతి చెందిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. ఆయన ఎందుకు ఉరివేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు. రాత్రికి రాత్రే మృత దేహాన్ని భువనగిరికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సీబీసీఐడీ అధికారులతో విచారణ చేపట్టాలని ఆయన కోరారు.