మల్యాల, ఫిబ్రవరి 29 : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం దుర్వినియోగం వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారిని సస్పెండ్ చేసినట్టు ఆలయ ఈవో టంకశాల వెంకటేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండగట్టు అంజన్న ఆదాయానికి ఓ ఉద్యోగి ఎసరు పెట్టడం, షాపుల లీజుకు సంబంధించి వ్యాపారులు చెల్లించిన రూ.37.90 లక్షలు స్వాహా చేయడం, దానిని ఉన్నతాధికారులు గుర్తించి సదరు ఉద్యోగికి మెమో ఇవ్వడం, ఈ వ్యవహారంపై ఈ నెల 24న ‘అంజన్న ఆదాయానికే ఎసరు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో సమగ్ర కథనం ప్రచురితమైంది.
దీనికి ఉన్నతాధికారులు స్పందించారు. రంగంలోకి దిగి విచారణ జరిపారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారి సరైన లెక్కలు చూపించకపోవడంతో సస్పెండ్ చేశారు. అలాగే అంజన్న ఆలయ ఆదాయం రూ.37.90 లక్షలను సీనియర్ అసిస్టెంట్ సొంతానికి వాడుకొన్నట్టు ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు మల్యాల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపారు.