మల్యాల, సెప్టెంబర్ 9: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ చైర్మన్ సస్పెండ్ అయ్యారు. అంజన్న క్షేత్రంలో గత నెల 9న హుండీ లెక్కింపు ప్రక్రియలో ఆలయ చైర్మన్ టీ మారుతీస్వామి బంగారు, వెండి నగలను దొంగిలించారని దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణ నివేదిక ఆధారంగా మారుతీస్వామిని సస్పెండ్ చేస్తూ రెవెన్యూ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సంజాయిషీ పత్రం అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మారుతీస్వామికి సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేసేందుకు ఆలయ సిబ్బంది శనివారం యత్నించగా, అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటి గోడకు అతికించినట్టు ఈవో టంకశాల వెంకటేశం తెలిపారు.