హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): డిప్యూటేషన్ కోసం నేరుగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్)కు లంచం ఇచ్చానంటూ ఆడియో వైరలైన ఘటనపై డీపీహెచ్ రవీందర్నాయక్ స్పందించారు. ఉన్నతాధికారులపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలను ఖండిస్తున్నట్టు చెప్పారు.
ఆరోపణ చేసిన ఉద్యోగినిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. తదుపరి విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిప్యూటేషన్ కోసం డీపీహెచ్ రవీందర్నాయక్ కాళ్లు పట్టుకోవడంతోపాటు దాదాపు రూ.70 వేలు లంచం ఇచ్చానని, రిలీవింగ్ లెటర్ కోసం మెదక్ డీఎంహెచ్వో చందునాయక్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇటీవల ఆడియో వైరలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘ఆరోగ్యశాఖకు లంచాల జబ్బు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం సైతం ప్రచురితమైంది.
నిబంధనలు పాటించారా?
మహిళా ఉద్యోగిని (హెల్త్ సూపర్వైజర్) సస్పెండ్ చేయడంపై వైద్యశాఖలో తీవ్ర చర్చ నడుస్తున్నది. ఆ ఉద్యోగినికి షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ తీసుకున్న తర్వాత సస్పెన్షన్ ఉంటుందని వైద్యశాఖవర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో నిబంధనలు పాటించకుండా నేరుగా సస్పెండ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఆడియోలో పేరొన్నట్టు లంచాల వ్యవహారం నిజమో కాదో ఎవరు తేల్చాలని ప్రశ్నిస్తున్నారు. జనవరి 2న తాను డీపీహెచ్ ఆఫీస్కు వెళ్లానని ఆమె చెప్తున్నారని, సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేస్తే బాగుంటుందని అంటున్నారు. మెదక్ డీఎంహెచ్వో చందునాయక్ అటెండర్, డీఎంహెచ్వో సహాయక సిబ్బంది బ్యాంకు లావాదేవీలు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.