సూర్యాపేట, ఏప్రిల్ 10 (నమస్తేతెలంగాణ): ‘మోసాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ.. ఎప్పటికీ దుర్మార్గపు ఆలోచనలు చేయడం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేటలో బుధవారం నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం లో ఆయన మాట్లాడారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరువు ఏర్పడిందని మండిపడ్డారు. వంద రోజుల తర్వాత కష్టాల్లో ఉన్న రైతుల్లో ఆత్మైస్థెర్యం నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలు బయట పెట్టగానే.. పనికిరావన్న కాళేశ్వరం బాహుబలి మోటర్లు ఆన్ అయ్యాయని తెలిపారు. ఆ మోటర్లను నెల రోజుల ముందు ఆన్ చేస్తే లక్షల ఎకరాల్లో పంటలు చేతికి వచ్చేవని చెప్పారు. గతంలో నాగార్జునసాగర్ నీటిమట్టం 508 అడుగుల్లో ఉన్నా కేసీఆర్ చొరవతో నీటిని విడుదల చేసి పంటలను కాపాడితే.. నేడు 513 అడుగులకు పైన నీళ్లున్నా విడుదల చేయడం లేదని గుర్తుచేశారు. ఓ వర్గం మీడియా కూడా కేసీఆర్పై విషం చిమ్ముతున్నదని, కాళేశ్వరం మూడు పిల్లర్లు కుంగితే కేసీఆర్ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రాజెక్టు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి కాల్వలకు అందించవచ్చని సూ చించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ నల్లగొండ లోక్సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.