మెదక్/వెల్దుర్తి, నవంబర్ 8 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హక్కీంపేట్, అచ్చంపేట గ్రామాల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల సర్వే చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఎస్ హరీశ్ తెలిపారు. సోమవారం మెదక్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 16, 17, 18వ తేదీల్లో సర్వే చేపడతామన్నారు. జమున హేచరీస్ భూములు ప్రిలిమినరీ సర్వేలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూ ముల్లో కబ్జాకు గురైన భూములపై సమగ్రంగా సర్వే చేయాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసిన మీదట జూన్లో విచారణ చేపట్టినట్టు తెలిపారు. కరోనా కారణంగా సర్వే ఆపాలని జమున హేచరీస్ అప్పట్లో పిటిషన్ వేయగా రెండు, మూడు నెలలు సర్వే ఆపాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. తాజా ఉత్తర్వుల మేరకు ఈనెల 16, 17, 18వ తేదీల్లో విచారణ చేపడతామన్నారు. సర్వే చేస్తున్నట్టు జమున హేచరీస్ యాజమాన్యంతోపాటు 154 మందికి నోటీసులిచ్చినట్టు తెలిపారు.