Telangana | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకొని గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని మరో సర్వే సంస్థ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? గెలుపెవరది? అనే అంశంపై ‘జనతా కా మూడ్’ అనే జాతీయ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మంది చొప్పున మొత్తం 1.20 లక్షల ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించింది. ఈ సర్వే ఫలితాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు భాస్కర్ సింగ్ బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సర్వేలో రాష్ట్రంలోని అత్యధిక మంది ఓటర్లు బీఆర్ఎస్కే జై కొట్టినట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు నమ్మకంగా ఉన్నారని తేలింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, తమకు మరింత మేలు జరగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడైంది.
జనతా కా మూడ్ సంస్థ చేపట్టిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీ 72-75 సీట్లు గెలుచుకోబోతున్నదని తేలింది. తద్వారా తెలంగాణలో మరోసారి సారు.. కారు… సర్కారు ప్రభంజనం పునరావృతం కా బోతున్నదని స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి 31-36 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. అంటే కాంగ్రెస్తో పోల్చితే బీఆర్ఎస్కు రెట్టింపు సీట్లు వస్తుండటం గమనార్హం. ఇక బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితం కానున్నది. ఈ పార్టీకి 4-6 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఎంఐఎంకు 6-7 సీట్లు వస్తాయని సర్వే పేర్కొన్నది. ఓట్ల శాతం పరంగా గమనిస్తే… అత్యధిక ఓటర్లు బీఆర్ఎస్కు జై కొట్టారు. బీఆర్ఎస్ అత్యధికంగా 41 శాతం ఓట్లను దక్కించుకోనున్నదని సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. ఎంఐఎంకు 3 శాతం, బీజేపీకి 14 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొన్నది.

కేసీఆర్కు సాటి రాగల లీడర్ లేడు
జనతా కా మూడ్ సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్కు సాటి రాగల మరో లీడర్ లేరని ప్రజలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్కు దీటైన నాయకత్వం ఇతర పార్టీలో కనిపించడం లేదని తెలిపారు. కేసీఆర్ పాలనపై ప్రజలు అత్యధిక విశ్వాసాన్ని చూపుతున్నట్టు తేలింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు, మహిళా, బీసీల సంక్షేమ పథకాలపై ఎంతో సంతోషంగా ఉన్నట్టు ప్రజలు తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు మోదీ సర్కారుకు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్పై నమ్మకం లేదు
ప్రజలు కాంగ్రెస్ను ఇప్పటికీ నమ్మడం లేదని సర్వేలో తేలింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వలేమిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. నాయకులు మధ్య కొట్లాటలకే సరిపోతున్నదని, ఇక తమ సంక్షేమాన్ని, ఇబ్బందులను పట్టించుకునే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. దీనికి తోడు కాంగ్రెస్ ఇస్తున్న హామీలపై ప్రజలు నమ్మకం చూపడం లేదని తేలింది. ఇందుకు కారణం కర్ణాటకలో అధిక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అక్కడ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక్కడ కూడా ఇదే విధంగా జరుగుతుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందనే నమ్మకం లేదని తేల్చి చెప్పారు. అయితే ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చే హామీలపై నమ్మకం వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో తేలింది.